Wednesday 30 May 2012

SAPTAGUNDAALA, CHINTALAMAADAARAM WATERFALLS published in Andhrajyothy on 27.5.2012

ట్రావెలోకం
సప్త స్వరాలు ఆలపించే 'సప్తగుండాల'

తెలంగాణలో రెండు మూడు మినహా పెద్దగా జలపాతాలు లేవు అనుకునే వారికి ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి అడవుల్లో ఒకేచోట ఏడెనిమిది అందమైన జలపాతాలున్నాయంటే ఆనందం, ఆశ్చర్యం కలుగక మానవు. ఈ జలపాతాలను చేరుకునే క్రమంలో చేసే 30-40 కి.మీ అటవీ ప్రయాణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఐబీ తాండూరు నుంచి కుడివైపుకి తిరిగి 5 కి.మీలు ప్రయాణించిన తరువాత వచ్చే '3 ఇంక్లయిన్' నుండి అటవీ మార్గం ప్రారంభమై సప్తగుండాల వరకు లోయలు, ఘాట్ రోడ్లు, మూలమలుపుల్లో వింతలు, విశేషాలను వీక్షిస్తూ ప్రయాణించడం ఒక మరపురాని మధురానుభూతి. పచ్చని అడవుల మధ్యలో విసిరేసినట్లున్న పల్లెల అందాలను ఆగి మరీ చూడవలసిందే. ప్రకృతి పొదుగులో ఒదిగినట్లున్న ఈ గ్రామాలు నాలుగు రకాలుగా కనిపిస్తాయి. కొన్ని గుట్టలపైనుండి కిందికి జాలువారినట్లుగా కనిపిస్తే మరికొన్ని గుట్టలపైనే తిష్టవేసినట్లు కనిపిస్తాయి. కొన్ని పచ్చని చెట్ల మధ్య ఎర్రని గడుల తివాచీ (బెంగుళూరు గూన కప్పిన ఇళ్ళు) పరిచినట్లుగా కనిపిస్తే, ఇంకొన్ని గుట్టల మధ్యలో చొచ్చుకుని ప్రకృతి ఔన్నత్యాన్ని మానవ నిర్మిత నిమ్నత్వాన్ని వ్యక్తపరుస్తున్నాయి. ఈ గుట్టలన్నీ సత్మాల కొండల సౌందర్యాలకు ప్రతీకలు. ఇక్కడ వీటి సరాసరి ఎత్తు సముద్ర మట్టానికి సుమారు 1800 అడుగులుండడంతో వాతావరణం చల్లగా ఉంటుంది. వర్షాకాలంలో అయితే ఊటీని తలపిస్తుంది.
తమ అవసరాలకు సరిపడా సాగుభూమి లేకపోవడంతో రైతులు గుట్టలపైనే కొంత అనువైన ప్రదేశాన్ని చదును చేసి వ్యవసాయం చేస్తుంటారు. గుట్టల ఏటవాలుల్లో ఏపుగా పెరిగిన రకరకాల చెట్ల మధ్య వారు వేసిన పంట చేలు అందంగా కనిపిస్తాయి.

ఎగుడు దిగుడుగా ఏర్పడిన కొండలను వెంట వెంటనే ఎక్కుతూ, దిగుతూ, మూలమలుపులు తిరుగుతూ పచ్చని చెట్ల మ«ధ్య వడివడిగా నల్లని త్రాచుపాములాగా సాగే సింగిల్ రోడ్‌పై చేసే ప్రయాణం కూడా అంత అందంగా, ఆహ్లాదంగా ఉంటుందని ఇక్కడ ప్రయాణించాకే తెలిసింది. ఈ రోడ్‌పై వాహనాల ట్రాఫిక్ ఉండదు. వనచరాల ట్రాఫిక్ మాత్రమే ఉంటుంది. పక్షుల రావాలు, నెమళ్ళ కీరాలు, కోతి-కొండెంగల గెంతులు ఇక్కడి సహజ దృశ్యాలు. ప్రత్యేకంగా చెప్పుకోవలసింది గుర్రాల గురించి. ఇక్కడ పల్లీయులు సమీపంలో ఉన్న పెద్ద గ్రామాలకు వెళ్ళి సరుకులు తెచ్చుకోవడానికైనా, ఇతరత్రా సంబంధాలు నెరపడానికైనా, దూరంలో ఉన్న పంట చేలకు వెళ్ళాలన్నా వారి వాహనం గుర్రమే. అది వారికి నాలుగుకాళ్ళ బైక్ లాగా ఉపయోగపడ్తుంటుంది.

ఇలా ప్రయాణ మార్గంలో కన్పించే ఎన్నో వింతలు విశేషాలన్నింటినీ ఫోటోలు, వీడియోలు తీసుకోవాలనిపిస్తుంది. అందుకై ఆగిన ప్రతి ప్రదేశంలో కూడా పక్కనే పరికిపండ్లు, ఉసిరికాయల చెట్లు మనల్ని ఊరిస్తాయి-తినమని. ఆ పక్కగా పారే పిల్లకాలువలు, వాగువంకలు చిన్న చిన్న జలపాతాలై సవ్వడి చేస్తాయి. వాటిలో కొన్ని సన్నగా పారితే మరికొన్ని పరుచుకుని పారుతాయి. ఇంకొన్ని జంప్ చేస్తాయి, దొర్లుతాయి. వీటిల్లో పెద్ద వరద కాలువ (వాగు) ఒకటి గోండుగూడకు అరకిలోమీటరు దూరంలో ఘాట్ దగ్గర మలుపు తిరిగి పిట్టగూడ-లింగాపూర్ గ్రామం మధ్య గుండా అడవుల్లోకి ప్రవేశించి తనలో మరికొన్ని పిల్ల కాలువలను కలుపుకుని మొదటిసారిగా మనకు 12 అడుగుల ఎత్తు జలపాతంగా దర్శనమిస్తుంది. ఆ తరువాత దట్టమైన అడవుల్లో ప్రవేశించి మరో ఆరు జలపాతాలుగా దుముకుతుంది. వీటిల్లో రెండవదైన పెద్దమిట్ట జలపాతం అన్నిటికంటే పెద్ద జలపాతం కాగా మూడవదైన నడిపిమిట్ట జలపాతాన్ని సాహసంతో మాత్రమే చూడగలం. ఆ తరువాత జలపాతాలనైతే అత్యంత సాహసం మీద మాత్రమే చూడగలం. అంతగా కాకులు దూరని కారడవిలో ఉంటాయవి.

పెద్దమిట్ట జలపాతం
లింగాపూర్ నుండి రోడ్ పక్కగా పంట చేల మధ్యలో సుమారు కిలోమీటరు నడిచిన తరువాత వస్తుంది పెద్దమిట్ట జలపాతం. అయితే అరకిలోమీటరు దూరం నుంచే ఈ జలపాతపు శబ్దాలు వినిపిస్తాయి. ఇక దగ్గరికొచ్చేందేమోనని వడివడిగా అడుగులు వేస్తే మాత్రం అల్లంత దూరంలో కూడా అగుపించదు. సరేనని నిదానంగా నడవడం మొదలుపెట్టాక సడన్‌గా కనిపించి కనువిందు చేస్తుంది. 50 అడుగుల ఎత్తు నుండి 70 అడుగుల వెడల్పుతో టేబుల్ మీద నుండి పడుతున్నట్లుగా సమాంతర ప్రదేశం నుండి దుముకుతుంది ఈ జలపాతం. చూడడానికి ఆనకట్టపై నుండి దుముకుతున్నట్టుగా ఉంటుంది. అయితే ఇది సృష్టి సౌందర్యం. సహజం. ఈ జలపాతం కింద వంద మీటర్ల వ్యాసంతో ఒక గుండం ఏర్పడింది. ఈ గుండం చుట్టుప్రక్కల ప్రాంతమంతా జారుడుగా ఉండడంతో దాని తూర్పు ఒడ్డున నిలబడే పడమర నుండి పడుతున్న జలపాతపు సోయగాలను చూడాలి. ఆ జలపాతపు తుంపర్లు మన చెంపలకు తగిలి మనల్ని తుంటరి చేష్టలకు ఉసిగొల్పుతాయి.

నడిపిమిట్ట జలపాతం
పెద్దమిట్ట జలపాతం నుండి సుమారు ఒక ఫర్లాంగు దూరం వాగు నీళ్ళలో, రాళ్ళలో, చెట్ల మధ్యలో నడిచాక నడిపిమిట్ట జలపాతం వస్తుంది. అంతదాకా వానపాములా మందగమనం సాగించిన వాగు ప్రవాహం ఒక్కసారిగా నాగుపామై పడగవిప్పి బుసలు కొట్టినట్టుగా జలపాతమై దుముకుతుంది. 70 అడుగుల ఎత్తు నుండి దూకే ఈ జలపాతం కేవలం ఏడు అడుగుల ఇరుకు సందు నుండి పారడం వల్ల దీని హోరు ఎక్కువ. ఈ జలపాతపు దూకుడే కనిపిస్తుంది కాని ఆ తరువాత అది ఎటు పోతుందో కనిపించదు. జలపాతపు తుంపర్ల వల్ల ఇక్కడి బండలు పాకుడుబట్టి జారుతున్నాయి. అయినా ఆ జలపాతపు జోరు తనను చూడమని టెంప్ట్ చేస్తుంటే ఒకర్ని పట్టుకుని ఒకరం పాకుకుంటూ ప్రయాణించి 70 అడుగుల లోతైన లోయలో హొయలు పోతున్న దాని సోయగాలను చూడడం రవిగాంచని చోటును చూశామన్న ఆనందాన్నిస్తుంది.

చింతలమాదారం జలపాతం
సుంగాపూర్ కూడలి నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో చింతలమాదారం గ్రామ పరిసరాల్లో మరో జలపాతం ఉంది. సుంగాపూర్ దాటి చింతలమాదారం వైపు ప్రయాణం ప్రారంభం కాగానే మనకు దట్టమైన అడవులే కాదు దట్టమైన గుట్టలు కూడా కనిపిస్తాయి. వాటి మధ్య 'అసలు దారి ఉందా, లేదా' అనుకుంటూ నిదానంగా వెళ్తుండగా మనం ప్రయాణిస్తున్న రోడ్ అకస్మాత్తుగా ఘాట్‌రోడ్‌గా మారి గుట్టలను చుడుతూ పైకి తీసుకెళ్తుంది. అలా మనం పైకి వెళ్తున్నకొద్దీ గుట్టల మధ్య పచ్చని లోయలు చిక్కనవుతూ, మనకు దూరమవుతూ 'దూరపు లోయలు పచ్చన' అన్న చందాన మనల్ని ఆనందింపజేస్తాయి.

చింతలమాదారంలో దారినపోయే ఏ ఆసామిని అడిగినా ఆయన వెంటనే మనల్ని తన ఇంటి వెనకాల నుండి పంట చేల మధ్యగా ఒక పర్వతం వైపు చూపిస్తాడు. అలా ఒక ఫర్లాంగు దూరం నడిచిన తరువాత జలపాతపు హోరు వినిపిస్తూ మనల్ని కవ్విస్తుంది- తనవైపు త్వరత్వరగా రమ్మని. మనం ఎంత వడివడిగా అడుగులు వేస్తూ పోతే అంత వడివడిగా వర్షం పరుగెత్తుకొస్తున్నట్టుగా ఆ జలపాతపు దూకుడు శబ్దం విన్పిస్తుంది. సమీపించాక కూడా అది దాగుడుమూతలాడుతుంది. గుట్ట అడ్డంగా ఉండడం వల్ల అది మనకు కన్పించదు. మరో గుట్ట మీద నుంచి జలపాతం దూకే గుండం దగ్గరికి వెళ్ళాలి. సగం విప్పిన తెల్లని గొడుగును బోర్లించినట్టు 60 అడుగుల ఎత్తు నుండి దూకే ఈ జలపాతం చుట్టూ కమ్ముకున్న కొండలు, అడవుల మధ్య చేసే అరుదైన శబ్దాలను ఆస్వాదించడం అదృష్టవంతులకే సాధ్యం. దూకుతున్న జలపాతపు మల్లెల తెల్లదనాన్ని, గుండం నీటి పారదర్శక స్వచ్ఛతను చూసి, తాగి, అరిచి ఆనందిస్తేనే ఈ జీవితానికి సార్థకత అనిపిస్తుంది. జలపాతం పక్కగా దాని ఎత్తులో సగం వరకున్న గుట్టనెక్కి అక్కడున్న చెట్టు కింద నిల్చొని జలపాతాన్ని తాకుతూ పొందే ఆనందాన్ని తమ గుండెల్లో దాచుకోవాలనుకునేవారు వచ్చే వర్షాకాలంలో తప్పనిసరిగా ఇక్కడికి ప్రయాణించాల్సిందే.

-
డా. ద్యావనపల్లి సత్యనారాయణ
94406 87250

Tuesday 22 May 2012

Travelogue published in Surya on 22.5.2012

విస్మృత క్షేత్రంలో విస్మృత పర్యటన

తెలుగు దేశంలో మధ్య యుగాలలో మహోన్నత స్థితిని అనుభవించిన క్షేత్రాలు ఇప్పటికీ అదే స్థితిలో కొనసాగుతు న్నారుు. అలాంటి క్షేత్రాల్లో ముందుగా చెప్పుకోదగినది శ్రీశైల క్షేత్రం గురించి . ఈ క్షేత్రం గురించే తెలుగులో మెుట్టమెుదటి క్షేత్ర మహత్మ్య కావ్యం వచ్చింది. అది పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్రలోని పర్వత ప్రకరణం. ఇది సుమారు క్రీ.శ.1290 ప్రాంతంలో రచించబడింది. ఇందులో శ్రీపర్వత (శ్రీశైల) క్షేత్ర దర్శనం శ్రీశైల ఉత్తర ద్వార క్షేత్రమైన ఉమామ హాశ్వరం నుంచి ప్రారంభమౌతుంది. ఈ పర్యటనలో పండితారాద్యుని శిష్యూడు దోనమ రాజయ్య మెుట్టమెుదట చూసింది శ్రీకుచేశ్వర, సిద్ధేశ్వర తదితర లింగాల యాలను. వాటిని చూడటానికి నేను, నా మిత్రుడు రామారావు, అతని తమ్ముడు లక్ష్మణ్‌ ఆ విస్మృత క్షేత్రంలో పర్యటన చేసి చివరికి చూడగలిగాము.

Unta
మరపురాని సాహసయాత్ర...
మనం ప్రయాణిస్తున్న వాహనం నల్లమల కొండను సగం ఎక్కి మూలమలుపు తిరిగి దక్షిణం శ్రీశైలం వైపు ప్రయాణిస్తున్నప్పుడు కుడివైపు చూస్తే ఆ కొండల నుండి కింది వైపు కొనసాగుతున్న ఒక రాతి కోటగోడ పచ్చని అడవుల మధ్య పాపిట లాగ తెల్లని రేఖలా అందంగా కనిపిస్తుంది. పర్వత ప్రకరనం ప్రకారం మేము కనుక్కోదలుచుకున్న ఆలయాలు ఆ కోట ప్రాంతంలో ఉంటాయనుకొని కల్చే మలపు దగ్గర ప్రారంభమౌతున్న కోటగొడను ఎక్కి దాని మీదనే పడమటి వైపు ఫర్లాంగు దూరం నడిచాము. ఆ గోడ ఎత్తు, వెడల్పులు సుమారు నాలుగేసి మీటర్లుంటాయి. అత్యంత పురాతనంగా కనిపిస్తున్న ఆ రాతి కోటగోడను ఎవరు ఎప్పుడూ కట్టించారో ఇప్పటివరకూ చరిత్రలో ఆనవాళ్లు లేవు.

దట్టమైన అడవి కావడంతో గోడ కూడా అందులో చిక్కుకుపోయింది. ఆగోడపై చేసే ట్రెక్కింగ్‌ ఒక సాహస చర్య మాత్రమే కాదు, జీవితంలో ఎప్పట్టికీ గుర్తుండి పోయే ఒక మధురానుభూతి. ఆ గోడపై నుంచి ఎటు చూసినా చుట్టూ ఎతె్తైన కొండలు, పచ్చని అడవులే దర్శనమిస్తాయి. ఆ అడవులు, చెట్ల నుంచి వచ్చే గాలి స్వచ్ఛమైనదే కాదు చల్లనైననది కూడా. ఆగాలి మనకిచ్చే హాయిని అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ ఆనందమేమిటో. చెట్లు, వృక్షాలు ఎన్నెన్ని ఆకృతులను ఆశ్రయి స్తాయో చూసి వాటినెక్కి ఆనందించాల్సిందే.

Siddరాతి గోడ రెండువె ైపులా విస్తరించడాన్ని పరిశీలిస్తే అది ప్రాచీ న కాలంలో ఒక గ్రా మాన్నో, పట్టణాన్నో చు ట్టూ కట్టబడింది అని అర్థ మైంది. ఆ కోట గోడ మధ్య నున్న పల్లపు ప్రాంతంలో కుం డ పెంకులు, ఇళ్ళ అడుగులు, నివాస యోగ్యమైన పరుపు బండలు, కొలను ఆనవాళ్ళు, ఉత్తరం వైపు పారుతు న్న వాగు కుడి ఒడ్డున కోనేరు కనిపించాయి. ఇక్క ఒక కొలనును స్థానికులు పరుమాళ్ళు కొలను అని పిలుస్తారు. శ్రీశైలం ప్రాచీన చరిత్రను అధ్యయనం చేస్తునప్పుడు మనకు పరమార అనే వం శం ఈ ప్రాంతానిన కీ.శ. 6వ శతాబ్దంలో పరిపాలించినట్టు తెలుస్తుంది. ఈ పరమాల లేదా ప్రమర అనే వంశం భ్రమర అనే పదం సంబంధితం అని భ్రమర (తుమ్మెద) మామిడి ఉమామహేశ్వర ఆలయ ఆవరణలో మూడు దశాబ్దాల క్రి తం వరకూ ఉన్నది కాబట్టి ఈ వంశంవారు ఇక్కడి ప్రాంతీయులే అని చెప్ప వచ్చు.

ఈ ప్రాంతాన్ని పాలించిన విష్ణుకుండల తరువాత పరిపాలనలోకి వచ్చిన ప్రమర వంశంలోని 5వ తరం రాజు చంద్రగుప్తుడు (గంధర్వసేనుడు). ఇతని కొడుకు శంఖుని పేర దగ్గర్లోని సలేశ్వరంలోని జలపాతాల్లో ఒకదానికి శంఖుతీర్థ అని పేరుంది. శంఖుని పేర దగ్గర్లోని సలేశ్వరం లోని జలపాతాల్లో ఒకదానికి శంఖు తీర్థం అని పేరుంది. రెండవ కొడుకు విక్రమాదిత్యుడు కీ.శ. 565లో ఉజ్జైనికి రాయ్యా డని స్కాంద పురాణాంతర్గత శ్రీశైలఖండం చెప్తుంది. 14వ శతాబ్దానికి చెందిన జక్కన ‘విక్రమార్క చరిత్ర’ కూడా ఈ విషయాన్ని వివరిస్తుం ది. విక్రమార్కుని చెల్లి... అనగా చంద్రగుప్తుని కూతురు చంద్రవతి ఈ ప్రాంతం లో ఆలయాలను కట్టించింది. కాబట్టి ఆమె పేరుతో ఈ ప్రాంతంలో చాలా ప్రదే శాలు కన్పిస్తాయి.

Untitఅవి... చంద్రపూర్‌, చంద్రవాగు, చంద్రసాగర్‌ (చెరువు), చం ద్రబండ (గుట్ట), చంద్రధార (చిన్న జలపాతం, ఉమామహేశ్వరం), చంద్రప్రభ పట్టణం. చంద్రవతి భోగవతీ పురాధీశ్వరుడైన రూపవర్మను వివాహమాడిందని భవిష్యపురాణం చెప్తుంది. ఉమామహేశ్వరం దిగువ భాగమే భోగవతీపురం. దా న్నిప్పుడు భోగమహేశ్వరం అంటున్నారు. చంద్రవతి మల్లెమాలలచే పూజించిన మద్ది (అర్జున) లింగమే శ్రీశైల మల్లికార్జునుడ య్యాడు. ఆ లింగం ఇప్పుడు వృద్ధ మల్లికార్జునలింగంగా శ్రీశైల దేవాలయ ఈశాన్య ఆలయంలో పూజలందుకుం టున్నది. పరుమాళ్ళ కొలను పరిసర పురావస్తు ఆధారాలు కూడా క్రీ.శ. 6వ శ తాబ్దం నాటి ప్రాచీనతను తెలుపుతున్నాయి. ఈ కొలను మీదనే ఫారెస్ట్‌ డిపార్ట్‌ మెంట్‌ వారు పెద్ద బావి కట్టారు. అయినా ఆ కోనేరు మెట్లు ఇంకా బయటికి కని పిస్తూనే ఉన్నాయి. ఈ ప్రాంతం నీటి వనరులతో, ఏపుగా పచ్చగా పెరిగిన చెట్టు చేమలతో చాలా అందంగా, ఆహ్లాదకరంగా ఉంది.

ఇది తెలిసిన కొద్ది మంది పర్యాటకులు ఇక్కడికి పిక్నిక్‌కు వస్తుంటారట. పరుమాళ్ళ దేవర కొలను చుట్టూ నలు దిక్కులా కిలోమీటరు చొప్పున అడవిలో అణువణువూ గాలించాము. అయినా మాకు గుప్తమహేశ్వరం కన్పించలేదు... ఒక్క ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వా రి ఔట్‌పోస్ట్‌ తప్ప. మధ్యాహ్నం మూడయ్యింది. లోపల ఆకలి దంచుతోంది. పైన ఎండ దంచుతోంది. చెట్ల నీడల్లో తిరుగుతున్నాం కాబట్టి బతికిపోయాం. అయినా అలసిపోయాం. ఇక్కడికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓంకార పిరమిడ్‌ ధ్యానాశ్రమానికి వెళ్ళి నిర్వాహకులు ప్రేమతో పెట్టిన ఉచిత భోజనం బొజ్జ నిండా తిన్నాం. తరువాత రామారావు పని ఉన్నదని తన తమ్ముడు లక్ష్మణ్‌ను కూడా పిలిపించాడు.
ఇక మేము గుప్త మహేశ్వరాలయం కోసం దట్టమైన చెట్ల పొదలను వెదుకదల్చుకున్నాం.

కాని మనుషులు దూరలేని పొదల్లోనే మధ్యాహ్నమం తా జంతువులు బస చేస్తాయి కాబట్టి మాకు ప్రమాదం ఎదురైతే ఎదుర్కొవడానికని లక్ష్మణ్‌ స్థానిక గిరిజనుని గుడిసెలో నుండి ఒక గొడ్డలి తీసుకొచ్చాడు. గొడ్డలిని చూసి మమ్మల్ని వేటగాళ్ళో, కలప దొంగలో అనుకుని ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, ఇద్దరు వాచ్‌మెన్లు పట్టుకున్నారు. విషయం చెప్పినా గుర్తింపు కార్డు చూపించాక సమాధానపడ్డారు. ఒక వాచ్‌ మెన్‌ దామా నాయక్‌ మాకు గుప్తమహేశ్వరాన్ని చూపించడానికి ఉత్సాహం చూపించాడు. దేవుడు మా శ్రమను చూడలేక దామా నాయక్‌ రూపంలో వచ్చాడనుకున్నాం.

దామా నాయక్‌ మొదట మాకు ఒక షెడ్‌ చూపించి ఇందులో లింగ ముంది అన్నాడు. ఆ షెడ్‌ను ఇంతకు ముందు మేము ఫారెస్ట్‌ ఔట్‌పోస్ట్‌ అనుకున్నాం. ‘ఇదేంటి ఇంత కొత్త షెడ్డు ప్రాచీనాలయం ఎట్లవుతుంది?’ అనడిగితే అతి కష్టమ్మీద పొదల్లో నుంచి మమ్మల్ని ఆ ఆలయంలోకి తీసుకెళ్లూ, ‘1975లో ఒక రేంజ్‌ ఆఫీసర్‌ ఇక్కడ శిథిలమై ఉన్న ఇటుక ఆలయాన్ని చూసి శిథిలాలను అటూ-ఇటూ తన్నుతూ శివలింగాన్ని కూడా తన్నగా అది విరిగిపోయింది. తరువాత మనశ్శాంతి లేక తన తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తంగా ఈ షెడ్‌ను కట్టించాడు’ అని చెప్పాడు. చాలా చోట్ల ఉత్తరాభి ముఖంగా ఉండే పానవట్టం ఇక్కడ తూర్పుకభిముఖంగా ఉంది. చతురస్రాకారంలో ఉన్న ఆ పానవట్టంలో ఫీట్‌ ఎత్తు లింగముంది. దానికి ఊర్ధ్వపుండ్రాలున్నాయి.

ఇదే సిద్ధేశ్వరలింగమై ఉంటుంది. ఎందుకంటే, సుమారు అర్థ శతాబ్దం కింద ఇక్కడ రోడ్‌ వేస్తున్న ప్పుడు దొరికిన ‘సిద్ధుల’ విగ్రహాలను ‘మూలమలుపు’ దగ్గర పోగేశారు. సిద్ధు లు స్థాపించిన అరుదైన మరకత లింగం (చిగురుపచ్చనిది) రెండు సంవత్స రాల క్రితం వరకు కూడా అక్కడే ఉండేది. ఇప్పుడు కొన్ని సిద్ధుల విగ్రహాలు సమీప మన్ననూరు తూర్పున ఒక వేప చెట్టు కింద ఉన్నాయి.

ధనం బండ - కుబేరేవ్వరాలయం...
ఇక్కడ్నుంచి దామా నాయక్‌ మమ్మల్ని ధనంబండగా పిలుస్తున్న పెద్ద పరుపు బండ వద్దకు తీసుకెళ్ళాడు. ఆ బండ తూర్పు కొసన కుబేరుని శిల్పం చెక్కి ఉం ది. దీనికి ఉత్తరాన శిథిలమై పోయిన ఇటుకల కుబేరేశ్వరాలయముంది. కుబే రుడు ధనానికి ప్రతీక కాబట్టి ఆ ఆశతో ప్రబుద్ధులు ఈ ప్రాంతంలో విపరీతం గా తవ్వకాలు జరుపడంతో ఇక్కడి ఆలయాల రూపురేఖలు కూడా కనుమరు గైపోతున్నాయి. హద్దులు లేని అత్యాశ, అజ్ఞానాలకు ఆలయాలకు ఆలయాలే బలికావడం చూసి బాధపడ్డాం. ‘శ్రీశైల ఖండం’ ఇక్కడి ఉమామహేశ్వర ప్రాం తం కుబేర స్థలమని, అతని పట్టణం పేరు మొదట మణిగిరి అని, తరువాత దాని పేరు ‘చంద్ర ప్రభ పట్టణం’గా మారిందని తెలియజేస్తుంది.

గుంటూరు జిల్లా భట్టిప్రోలు శాసన ఫలకాల మీదున్న కుబేరుని పేరుని బట్టి, ఆదిలాబాద్‌ జిల్లాలో కుబేరుని పేరు మీదున్న కుబీర్‌ పట్టణంలో కన్పించే పురావస్తు ఆధారా లను బట్టి కుబేరుడనే రాజు తెలుగు దేశాన్ని క్రీ.పూ. 4వ శతాబ్దం ప్రాంతంలో పరిపాలించాడని తెలుస్తున్నది. అప్పటి మణిగిరి పట్టణం క్రీ.శ. 4వ శతాబ్దం నుండి ‘చంద్రప్రభ పట్టణం’గా మారిందని చంద్రగుప్తుని కూతురు చంద్రవతి గాథ తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ఆలయాలు తొలితరంలో రూపు దిద్దుకొని ఇప్పటికీ శిథిలమాత్రంగానైనా నిలిచి ఉన్నాయని చెప్పవచ్చు.

గుప్తమహేశ్వరం...
‘పర్వత ప్రకరణం’లో దోనమయ్యకు సర్వజ్ఞ మల్లికార్జునుడు వృద్ధ తపస్వి రూపంలో కనబడి ఉమామహేశ్వరానికి ‘తూర్పున చూడు సంస్తుత్యమై గుప్తమహేశ్వరం బొప్పు మహిత తల్లింగ మహాత్మ్యమది అవాఙ్మరసాత్మకమ్ము’ అంటూ గుప్త మహేశ్వరాన్ని చూపించి, ఆ లింగం వాక్కు, మనసు, ఆత్మలను ఆనందింపజేసే మహత్మ్యం కలదని వివరించినట్లుంది. దురదృష్టవశాత్తు ఆ లింగం ఇప్పుడు లేదు. ధనం కోసం దాన్ని పెకిలించి దాని కింద తవ్వారు. ఆ దొంగల తవ్వకాల్లో ఆ లింగం ధ్వంజమై ఉంటుంది. లేదా ఆ లింగాన్నే ఎక్కడి కో తీసుకెళ్ళి అమ్ముకుని ఉంటారు. అర్థ మంటపం, అంతరాళం, గర్భగృహా లతో శిలా నిర్మితమైన ఈ ఆలయం మాత్రం తన అత్యంత ప్రాచీన వైభవాన్ని ప్రదర్శిస్తున్నది. అంతరాళం ద్వారం పై కడపకు లక్ష్మీదేవి విగ్రహం చెక్కి ఉంది.

Parumaఈ ఆలయం ఎదురుగా పడమరన యాభై ఫీట్ల దూరంలో అత్యంత అరుదైన నంది విగ్రహముంది. ఒక ఫీటు ఎత్తు, రెండు ఫీట్ల పొడవు దాని కొలతలు. దాన్ని అరుదైన మెత్తటి రాయి నుండి గాని, సున్నపు గారతో గాని శిల్పించారని అన్పిస్తుంది. ఇలాంటి నంది విగ్రహమొకటి గుంటూరు జిల్లా అమరావతిలోని అమరేశ్వరాలయంలో ఉంది. అది క్రీ.శ. 2-4వ శతాబ్దాల నాటిదని పురావస్తు నిపుణుడు ఐ.కె.శర్మ నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గుప్త మహేశ్వర నంది కూడా 1600 సంవత్సరాల కిందటిదని నిర్ధారించవచ్చు. మొదట ఈ నంది ఆలయ అంతరాళంలో ఉండేదన్నట్లుగా అర్థమవుతుంది. కొద్ది శ్రమ, కొంచెం ఖర్చుతో ఈ ఆలయాన్ని పునరుద్ధరించ వచ్చు. అలా చేస్తే పర్యాటకులకు, భక్తులకు పచ్చని అడవులు, కొండలు, సెలయేళ్ళ మధ్య ఆనం దించే అరుదైన అవకాశం దక్కుతుంది.

‘శ్రీశైల ఖండం’ ఇక్కడి ఉమామహేశ్వర ప్రాంతం కుబేర స్థలమని, అతని పట్టణం పేరు మొదట మణిగిరి అని, తరువాత దాని పేరు ‘చంద్ర ప్రభ పట్టణం’గా మారిందని తెలియజేస్తుంది. గుంటూరు జిల్లా భట్టిప్రోలు శాసన ఫలకాల మీదున్న కుబేరుని పేరుని బట్టి, ఆదిలాబాద్‌ జిల్లాలో కుబేరుని పేరు మీదున్న కుబీర్‌ పట్టణంలో కన్పించే పురావస్తు ఆధారాలను బట్టి కుబేరుడనే రాజు తెలుగు దేశాన్ని క్రీ.పూ. 4వ శతాబ్దం ప్రాంతంలో పరిపాలించాడని తెలుస్తున్నది. పరుమాళ్ళ కొలను పరిసర పురావస్తు ఆధారాలు కూడా క్రీ.శ. 6వ శతాబ్దం నాటి ప్రాచీనతను తెలుపుతున్నా యి. ఈ కొలను మీదనే ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వారు పెద్ద బావి కట్టారు. ఆ కోనేరు మెట్లు ఇంకా బయటికి కనిపిస్తూనే ఉన్నాయి.

- డా. ద్యావనపల్లి సత్యనారాయణ
తెలుగు యూనివర్శిటీ ఆడిటర్‌, సెల్‌: 9440687250

Wednesday 9 May 2012

అలనాటి మంచి పర్యాటక కేంద్రం

  • -ద్యావనపల్లి సత్యనారాయణ in Sunday Andhrabhoomi, 06/05/2012.
ఎకో టూరిజం అనే భావనను మనం ఈ మధ్య కనిపెట్టాం అని అనుకుంటున్నాం. కాని కొద్ది తేడాలతో వందల ఏళ్ల కిందటే ఎకో-టూరిజాన్ని ఎంజాయ్ చేసిన రాజులు, రాజన్యులు ఎందరో ఉన్నారు. ప్రత్యేకించి నిజాం రాజుల గురించి చెప్పుకోవాలి. వారు, వారి బంధువులు, అధికారులు తమ రాజ్యం (తెలంగాణ)లో ఉన్న ఎన్నో అడవులను వేట పర్యాటక కేంద్రాలుగా మలచుకున్నారు. అలాంటి షికార్‌ఘర్’ (వేట కేంద్రం) ఒకటి నిజామాబాద్‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని పేరు మంచిప్ప. ఇది హైదరాబాద్ - నిజామాబాద్ రహదారి మీద సుమారు 130 కి.మీ.లు ప్రయాణించిన తరువాత వచ్చే దగ్గి నుండి ఎడమ వైపు 20 కి.మీ. ప్రయాణించిన తరువాత వస్తుంది. నిజాంల కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఒకే ఒక పర్యాటక కేంద్రంగా గుర్తింపబడిన ఈ మంచిప్ప ఇప్పుడెలా ఉందో చూద్దాం.
అలరించే అటవీ ప్రయాణం..
దగ్గి నుంచి ఉత్తనూర్ మీదుగా 7 కి.మీ.లు ప్రయాణించిన తరువాత వచ్చేగంటావారి పల్లెనుంచి అటవీ ప్రయాణం ప్రారంభమవుతుంది. సమతలం నుంచి క్రమంగా పీఠభూమి నెక్కడం, ఆ తరువాత కొండల వరుసలు, అడవుల పచ్చని చెట్ల మధ్యగుండా ప్రయాణించడం మధురానుభూతిని మిగులుస్తుంది. ఈ 13 కి.మీ.ల అటవీ ప్రయాణంలో ఎన్నో వింతలు, విశేషాలు కనిపిస్తాయి. కొండలకు నిలువుగా చెక్కినట్లున్న అంచుల వద్ద కట్టుకున్న గిరిజన గూడెలు, గిరిజనుల వేష భూషాదులు, వారి వ్యవసాయ కార్యకలాపాలను చూస్తూంటే మన ప్రక్కనే ఉంటూ మనకంటే ఎంత వెనుకబడి ఉన్నారో అర్థమవుతుంది. అయినా ఎంత సహజంగా ఉన్నారు అనే విషయాలు ఆలోచింపజేస్తాయి. వారితో మాట్లాడితే మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
కొండల లోయల్లో నుంచి పారుతున్న సెలయేరుల గలగలలు, వాటి స్వచ్ఛత ఏ మినరల్ వాటర్‌తో పోల్చగలం. తాగితేనే తెలుస్తుంది వాటి మాధుర్యం. సెలయేళ్ల ప్రవాహంలో దిగి ఆ నీళ్లతో సరసాలాడాలనిపిస్తుంది. దుముకాలనిపిస్తుంది. అసలు రెండు పచ్చని కొండల మధ్య తెల్లగా నురగలు కక్కుకుంటూ పారే సెలయేళ్లు అందమే నయనానందకరం. మళ్లీ సెలయేళ్ల ప్రవాహం ఒడ్డు ఎక్కడం, ఒక సాహసం. మళ్లీ లోయలు, మళ్లీ కొండలు, మలుపులు, ఎత్తుపల్లాలు, ఇలా సాగుతుంది ప్రయాణం. అల్లంత దూరాన తెల్లని ఆవుల మందలు, పచ్చని చేల మధ్య పచ్చిక మేస్తున్న నల్లని బర్రెలు, గొర్రెలు, మేకలు.. ఇవన్నీ చూస్తే ఎంత సహజ సౌందర్యాన్ని మిస్సవుతున్నామో అర్థమవుతుంది.
గాంధారి అడవులుగా పేరుగాంచిన ఈ అడవుల్లో దట్టమైన అడవి ప్రారంభమయ్యే ప్రాంతం ఒక సుందర దృశ్యం. ఇక్కడ సడన్‌గా ఒక గుట్ట అడ్డమొచ్చి, ప్రయాణాన్ని అడ్డుకుంటుంది. దానివల్ల ఆ గుట్టను రెండుగా చీల్చవలసి వచ్చింది. ఎల్ ఆకారంలో ఇరుకైన ఆ గండి మధ్య నుంచి మెల్లగా ప్రయాణించి పచ్చని చిక్కని అడవుల్లోకి అడుగిడటం అనిర్వచనీయమైన ఆనందాన్నిస్తుంది. కొండలపై నుంచి వచ్చే సెలయేళ్లకు అడ్డంగా ఆనకట్టలు కట్టి చిన్నచిన్న చెరువులు కట్టుకుని వాటి కింద సాగుచేస్తున్న చేలు, తెల్లని చెరువుల కింద పచ్చని చేలు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో భూమిపై ప్రసరించే అరుణారుణ వర్ణాలు.. ఇలా ఎన్ని రంగుల కలలనో సాకారం చేసుకోవచ్చు. ఇరుపక్కలా విస్తరించిన పచ్చని ఎతె్తైన చెట్ల మధ్య నల్లని పాపిటలాగా సాగే సింగిల్ బ్లాక్‌టాప్ రోడ్డు మీద స్వచ్ఛమైన గాలులను ఆస్వాదిస్తూ ప్రయాణించడం అలరిస్తుంది.
ముస్లిం రాజుల కట్టడాలు
ఇలా ప్రయాణించిన తరువాత మొదటిగా కనిపించేది నిజాం గెస్ట్‌హౌస్. ఇది మంచిప్ప చెరువు ఈశాన్యం గట్టు మీద నిర్మించబడింది. ఇదొక పెద్ద భవంతి. ముస్లిం వాస్తు శైలికి మచ్చుతునక. ఇందులో ముందు హాలు, మధ్య హాలు, వెనుక (చెరువు వైపు) కిచెన్ ఉన్నాయి. అయితే ఈ కట్టడంలో వాడిన ఇటుకల పరిమాణం తొమ్మిది న ఏడు న రెండు అంగుళాలు కావడంతో ఇవి గోల్కొండ కుతుబ్‌షాహీల కాలంలో వాడుకలో ఉండేవి కాబట్టి ఈ గెస్ట్‌హౌస్‌ను ఏ నాలుగు వందల సంవత్సరాల కిందనో కట్టారని చెప్పవచ్చు. నిజాంల కాలంలో (18, 19 శతాబ్దాలు) మరమ్మతులు జరిగినట్లు చెప్పడానికి నిదర్శనంగా చిన్న ఇటుకలు కూడా కనిపిస్తున్నాయి. ఈ గెస్ట్‌హౌస్‌కు కొంచెం దూరంలో దక్షిణాన పెద్ద మసీదుల సముదాయం ఉంది. గెస్ట్‌హౌస్, మసీదుల మధ్య మూడు వైపులా పిట్టగోడలు ఉన్న ఒక నిర్మాణంలో ఉన్న మూడు గద్దెలు నిర్మించబడ్డాయి. ఆ గద్దెలు ముస్లిం సమాధులా అనే అనుమానం కూడా వస్తుంది. ఏమైనా ఈ మూడు నిర్మాణాలూ గెస్ట్‌హౌస్, మసీదులు, గద్దెలు మంచిప్ప చెరువుకు ఎదురుగా దాని ఒడ్డునే నిర్మించబడ్డాయి. కాబట్టి ఆనాటి ముస్లిం రాజన్యులు, ధనికులు వీటిల్లో కూర్చుని చెరువుపై నుంచి వచ్చే చల్లగాల్లుల్ని ఆస్వాదించేవారని చెప్పవచ్చు.
షికార్లు..
నిజాంలు, వారి అధికారులు మంచిప్పకు రావడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, ఇది ఎతె్తైన ప్రదేశం. సముద్ర మట్టానికి ఈ ప్రదేశం సుమారు 600 మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లాలో ఇది రెండవ ఎతె్తైన ప్రదేశం. ఇక్కడికి 7 కి.మీ.ల దూరంలో ఉన్న చద్మల్ పీఠభూమి (కొండల పైభాగం) నుండి వాగులు పుట్టి ఈ మంచిప్ప చెరువు వరకు ప్రవహిస్తాయి. కాబట్టి ఈ ప్రాంతం ఎతె్తైన కొండలు, పచ్చని అడవులు, గలగల పారే సెలయేళ్లతో కూడి చల్లగా ఉంటుంది. పర్యాటకులను అలరిస్తుంది. ఇక రెండవ కారణం ఇక్కడి అడవులు అనేక జీవ జంతువులకు ఆవాసాలు కావడంతో వేటాడటానికి రాజన్యులకు అవకాశముండేది. పొద్దంతా వేటాడి సాయంత్రం ఇక్కడి గెస్ట్‌హౌస్‌లో వండించుకుని, వడ్డించుకొని తింటూ తాగుతూ ఎంజాయ్ చేసేవారని ఈ ప్రాంత పెద్దలు చెప్తారు. ఇక్కడి చెరువు కూడా పెద్దది కాబట్టి ఇందులోకి పుట్టిలలో వెళ్లి చేపలను పట్టుకొని వేయించుకొని తినేవారట.
మంచిప్ప చెరువుకు అన్ని పక్కలా పచ్చని గుట్టలున్నాయి. ఒక తూర్పు - ఈశాన్యం తప్ప. అదొక సుందర దృశ్యం. వాయవ్యం, ఈశాన్యం కొండల మధ్య సుమారు కిలోమీటరున్నర దూరం ఉంటుంది.
ఈ మధ్య దూరంలో కట్టిన ఆనకట్ట మీద చెరువులో చేపలు పట్టుకుంటున్న పక్షులను చూస్తూ, చెరువు కింద పచ్చని పొలాలను చూస్తూ నడిచే ట్రెక్కింగ్ చక్కని అనుభూతి నిస్తుంది. ప్రస్తుతం నిజామాబాద్ పట్టణానికి ఈ చెరువు నీరే ఆధారం.
ఇక్కడి దేవాలయాలెప్పటివో?
నిజాం గెస్ట్‌హౌస్ వెనుక చెరువు తూము దగ్గర రెండు గుండ్ల మధ్యలోని గుహలో ఒక దేవాలయం, దీనికి ఉత్తరాన 50 మీటర్ల దూరంలో మరో దేవాలయం ఉంది. మొదటి దేవాలయం ఎప్పటిదో చెప్పటానికి వీలులేకుండా ఉంది. ఇటీవల కట్టిన దాని గోడలు, పై కప్పు దాని ప్రాచీనతను కప్పిపుచ్చుతున్నాయి. కాని అది మధ్యయుగాల నాటిదని చెప్పడానికి నిదర్శనంగా దాని ఆగ్నేయంలో ఆనాటి చెక్కిన స్తంభం ఒకటి ఉంది. ఇక రెండవ దేవాలయం అత్యంత ప్రాచీనమైనదిగా తోస్తుంది. శివలింగం, గణపతి, హనుమంతుడు, నాగిని శిల్పాలు, వాటి ముందరి చక్రం, శిల్పం - అన్నీ చాలా ప్రాచీనమైనవిగా తోస్తున్నాయి. ఈ ఆలయం చుట్టూ చాలా పొడవు, వెడల్పులతో ఉన్న అతి ప్రాచీన ఇటుకలతో ప్లాట్‌ఫామ్ నిర్మించబడి ఉంది. గెస్ట్‌హౌస్ ముందు కూడా ఒక స్థూపాకార గొట్టం పడి ఉంది.
చేయవలసినవి
ఇవన్నీ ఎప్పటివి? వీటిని ఎవరు ఏ కాలంలో కట్టించారు? ఆయా కాలాల్లో వీటి ప్రాధాన్యం ఎలా ఉండేది మొదలైన విషయాలను పరిశోధించవలసి ఉంది. గెస్ట్‌హౌస్‌కు దక్షిణాన పిట్టగోడల మధ్యనున్న గద్దెల వంటి నిర్మాణాలను, వాటి ముందర పది మీటర్ల వరకు విస్తరించిన కట్టడాల బేస్‌మెంట్లు కనిపిస్తున్నాయి కాబట్టి అవి చెరువు మీది నుంచి పిల్లగాలులను ఆస్వాదించేందుకు వీలుగా నిర్మించిన కట్టడాలైతే వాటిని పునరుద్ధరిస్తే అంత ప్రాచీనమైన నిర్మాణాల్లో ఆనందిస్తున్నామని పర్యాటకులు గర్వపడతారు. అలాగే గెస్ట్‌హౌస్‌ను కూడా అతి కొద్ది ఖర్చుతో ఆధునీకరించి అందరికీ అందుబాటులోకి తేవచ్చు. మసీదులు, గెస్ట్‌హౌస్ మధ్యనున్న ఎత్తుపల్లాల ఖాళీ స్థలంలో పార్క్‌ను ఏర్పాటు చేయవచ్చు. పార్కు నానుకొని బోటింగ్ సౌకర్యాన్ని, ఏంజ్‌లింగ్, నీళ్లపై నడిచే బెలూన్ తదితర వాటర్ స్పోర్ట్స్ సౌకర్యాలను ఏర్పాటుచేస్తే సమీప నిజామాబాద్ పట్టణ ప్రజలే కాకుండా వివిధ ప్రాంతాల ప్రజలకు కూడా ఒక మంచి పర్యాటక కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లవుతుంది. ఈ ప్రాంతంలో గిరిజన ప్రాబల్యం ఎక్కువ కాబట్టి వారు సేకరించే అటవీ ఉత్పత్తులు, వారు చేత్తో చేసే చేతి ఉత్పత్తులను (హస్తకళలు) వారు ఇటీవల ఇక్కడ కట్టుకున్న భీమన్న దేవాలయం దగ్గర మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే అటువారికి, ఇటు పర్యాటకులకు లాభం కలుగుతుంది.