Tuesday 27 November 2012

Matsyagiri published in namasthetelangaana on 25-11-2012

మరో యాదగిరి... మత్స్యగిరి
- డా॥ ద్యావనపల్లి సత్యనారాయణ
chepa-aakaarapu-saalagraamaమత్స్యం అంటే చేప కదా! మత్స్యగిరి చేప ఆకారంలో ఉంటది. కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. అయితే మత్స్యగిరి దగ్గరనున్న పొట్టిగుట్ట దగ్గర్నుండి వెళ్తే ఈ గిరి అచ్చంగా చేప ఆకారంలో కనిపిస్తది.
మత్య్సగిరిని వేములకొండ పల్లె పరిసరాల నుంచి సగం వరకు ఎక్కగానే ఒక ప్రాచీన శిలా ద్వారం కనిపిస్తది. ఆ ద్వార బంధానికి ఒక చేప శిల్పం చెక్కి ఉండటం మరో విశేషం. ప్రస్తుతం శిథిలమైనప్పటికీ ఆ శిల్పం సుమారు మూడడుగుల పొడవుంటది.

మత్స్యగిరి శిఖరాక్షిగాన చిన్నపాటి చెరువుంది. ఈ చెరువూ ఒక వింత. సాధారణంగా పెద్ద పెద్ద కొండల్లో ఇంకిన వర్షపు నీరు పారి కొండల కింద చెరువు లేర్పడతాయి. కానీ పైన చెరువుండటం నిజంగా వింతే! దీన్నే భక్తులు ‘భగవంతుని లీలా మహత్మ్యం’ అంటున్నరు.

ఈ చెరువులోని చేపలు మరో ముఖ్య విశేషం. ఇందులో ఉండేవన్నీ ఒకే రకపు చేపలు. అవన్నీ ఒక పరిణామంలో...సుమారు అర మీటరు పొడవుతో చిన్న డాల్ఫిన్లలాగా దొమ్మరి గంతలు వేస్తూ కనిపిస్తయి. వాటన్నింటి తలమీద మూడేసి విష్ణు నామాలుంటయి. ఇది మరీ ఆశ్చర్యానందాలకు గురి చేసే అంశం. ఎందుకంటే, ఇదివరకెప్పుడూ మనం ఇలాంటి నామాల చేపలను చూసి ఉండం!

laxminarasimha-svaamiఅయితే, ఈ చేపలుండే గుండం నిజానికి మూడు గుండాల సముదాయం. వీటి పేర్లు నామాలగుండం, విష్ణు గుండం, మాల గుండం. నీటి మట్టం పెరిగినప్పుడు ఇవి మూడూ కలిసిపోయి నైరుతి నుంచి ఈశాన్యం వైపు అర్ధచంవూదాకారపు వంపు తిరిగిన ఒకే గుండం లాగా కనిపిస్తయి. ఈ అర్ధ చంద్రకారపు గుండం మధ్యలో అంటే గుండం పడమటి ఒడ్డున...నీటి అంచున ఆరడుగుల పొడవైన చేప విగ్రహముంది. ఈ విగ్రహం చేప పల్టీ కొట్టేటప్పుడు కనిపించే వంపుతో ఈశాన్యం నుంచి నైరుతి వైపు తిరిగినట్లుగా కనిపిస్తది. చేప మఖం మాత్రం తూర్పువైపుకు తిరిగి ఉంటుంది.

ఈ విగ్రహం చుట్టూనే 1991లో ఆలయం కట్టారు. గుండంలో నీటిమట్టం పెరిగినప్పుడు ఈ చేప సాలక్షిగామం నీటిలో తేలియాడుతున్నట్లు కనపడుతుందని అక్కడి పూజారి లక్ష్మణాచార్యులు చెప్పారు. ఈయన ఈమధ్య ఈ మత్స్యగిరి స్థలపురాణం, ఇటీవలి చరివూతను కూడా నిక్షిప్తం చేసే పనిలో ఉన్నరు. జిన్నం అంజయ్య అనే మరొక కవి కూడా ఈ మధ్యనే మత్స్యగిరిపై శతకం రాసి ప్రచురించారు.

మత్స్యగిరి పైన వృద్ధులు, రోగిష్టులు కనిపించడం సాధారణం. కొండ కిందికి ప్రయాణిస్తున్నప్పడు పైకి వెళ్తున్నప్పుడు రోగులు కనిపిస్తుంటరు. విచారిస్తే పైన కొన్నాళ్ళుంటే చాలు ఎంతటి క్లిష్టమైన రోగాలైనా నయమవుతాయని చెప్తరు. దేవుడి మహితో పాటు నీటికి కూడా రోగాలను నయం చేసే శక్తి ఉందన్నది ఇక్కడికి వచ్చేవాళ్ల విశ్వాసం.

నిజానికి కూడా భూ ఉపరితలం పైన నాలుగైదు వందల అడుగుల ఎత్తున ఉన్న ఈ మత్స్యగిరి ఆలయం పైకి స్వచ్ఛమైన, చల్లని గాలులు వీస్తుంటయి. మత్స్యగుండం కూడా కాలుష్యానికి దూరంగా ఉండి స్వచ్ఛమైన నీటికి ఆలవాలంగా ఉంది. ఇటీవలి కాలం వరకూ ఈ గుండంలో ఉన్న తామర చెట్ల ఆకులు కూడా ఆ గుండంలోని మలినాలను, సూక్ష్మజీవులను గ్రహించి నీటిని పరిశుద్ధంగా ఉంచేవి. కాబట్టి, అంటువ్యాధులను వ్యాపింపజేసే సూక్ష్మక్షికిములకు దూరంగా ఈ మత్స్యగిరిపై కొంతకాలం ఉండి, పరిశుద్ధమైన నీటిని తాగితే రోగాలు నయమవుతుండేవని చెబితే నమ్మడానికేమి అభ్యంతరం ఉండదు! ఇక ఈ మత్స్యగుండం నీటిని తాగిన వారికి సంతానమయ్యేదని, పంట పొలాలు, చేలపై చల్లుకుంటే కీటకాలు నశించి పంటలు బాగా పండేవని కూడా స్థానికులు చెబుతుంటరు.

కొచ్చెగుట్టపైన కూడా ఒక మడుగు (గుండం) ఉంది. ఈ గుట్టను ఎక్కితే మంచి ట్రెక్కింగ్ ప్రాక్టీస్ అవుతది. ఇక్కడి మడుగులో రాయి వేస్తే భిన్నమైన శబ్ధం వస్తుంది. బహుశా గుట్ట నిలువునా లోతైనా బావిలాంటి గుండం ఉండడం వల్లనేమో...అలాంటి శబ్దం వస్తది. ఈ గుండం నీటిలో స్నానం చేస్తే చర్మ రోగాలు నయమవుతాయంటారు.

ఇక మాలగుట్ట గుహల్లో కూడా ఒక చిన్న గుంట ఉంది. ఆ గుంటలో నీరును మనం తీసిన కొద్దీ అంతే పరిమాణంలో నీరు మళ్ళీ ఊరడం విశేషం.

matsyagunDam-teeraana-aalayప్రస్తుతం మత్స్యగిరిపై కనిపిస్తున్న, ఆలయ మంటపాదులు 1977 నుంచి నిర్మించబడుతున్నవే. అయితే, ఈ గిరి పరిసరాల్లో కనిపిస్తున్న శిథిల ఆలయాల చరిత్ర మాత్రం వేల ఏళ్ల వెనకాలది. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయానికి దక్షిణంగా గుట్టను సగం దిగాక కనిపిస్తున్న శివాలయం చాలా ప్రాచీనమైంది.
ఎక్కడైనా ప్రాచీన ఆలయాలు పూర్తిగా రాతితో గాని, ఇటుకలతో గాని నిర్మించబడుతయి. ఈ శివాలయం గర్భగృహానికి మాత్రం మూడు వైపులా పవేశ దిశ మినహా) ఇటుకల గోడలున్నయి. వాటి లోపల రాతిగోడలున్నయి. ఈ ఇటుకల పొడవు, వెడల్పులు 14X10 అంగుళాలు.

14 అంగుళాల పొడవున్న ఇటుకల వాడకం సుమారు 1400 సంవత్సరాల కిందట ఉండేదని తెలుస్తోంది. ఈ ఇటుకల గుడి వాస్తు నిర్మాణ శైలిని బట్టి ఇది ఆనాడు ‘జైనుల మందిరం’ అని తెలుస్తోంది. ప్రత్యేకించి ఇది శ్వేతాంబర జైనులది. శ్వేత అంటే తెల్లని అని అర్థం. స్థానిక ప్రాకృత తెలుగు భాషలో ‘వలి’ అంటే తెల్లని అని అర్థం. దగ్గర్లోని వలిగొండ అనే ఊరు ఆనాడు శ్వేతాంబర జైన ప్రాబల్యమున్న ఊరే అయ్యుంటుందని భావిస్తున్నరు. పక్కనే వేముల కొండ ఉంది. వేములు అంటే కూడ జైనులే. ఆ పక్కనే మునిపంపుల అనే ఊరుంది. ‘మునులు’ అంటే జైన మతానికి చెందిన ఋషులు. మత్స్యగిరి పక్కనున్న మాలగుట్ట పైనా జైనుల గుహలున్నయి.

జైనులు తమ మతానికి ప్రతీకగా చేపను చూపుతరు. మీననాధుడు అనే ప్రఖ్యాతి చెందిన సిద్ధుడు కూడా జైనుడే. 24 మంది జైన తీర్థంకరుల్లో ఒకరికి ప్రతీక చేపనే. జైనులే మాల, మాదిగలకు ఆలయ ప్రవేశం కల్పించారు. కాబట్టి ఇక్కడ మాలగుట్ట, మాలగుండం, మాదిగగుండం లాంటివి కన్పిస్తున్నయని భావించవచ్చు.

మత్స్యగిరి వెళ్లాలంటే...
ప్రయాణ మార్గంలో చౌటుప్పల్ నుండి ఇరుపక్కలా మూడు రంగుల్లో కొండలు ఆకర్శిస్తయి. అవి పొట్టివి, పొడవైనవి, ఎత్తెనవి. తెల్లనివి, నల్లనివి, పచ్చనివి. ఇలా అన్నేసి కొండలు రంగురంగుల్లో కనిపిస్తుంటే ప్రయాణం మార్గంలోనే ఒక విశిష్టమైన భావన హృదయాలను పావనం చేస్తుంది. ఇక వలిగొండకు చేరుకునే ముందు మనకు కుడివైపున కనిపించే ఎత్తైన కొండల శిఖర ప్రదేశాల్లో శిలా తోరణాలూ కన్పిస్తయి. ఇలాంటి ఒక శిలా తోరణాన్ని తిరుపతిలో చాలామంది చూసే ఉంటరు. ఇక్కడ మాత్రం అలాంటివి మూడు తోరణాలు కనిపించి మనల్ని ముగ్దుల్ని చేస్తయి.

వలిగొండ దగ్గర కొండల మధ్య పారే ‘మూసీ’ హైదరాబాద్‌లో కనిపించినట్లుగా మురుగు నది కాదు, ముచ్చటైన నది. అంతేకాదు, ఇక్కడి పచ్చని చెట్లతోకూడిన లోయ మార్గం మనల్ని మరింత ఆశ్చర్యపరుస్తది. గోధుమ వర్ణపు రాళ్ళపై నుండి తెల్లని నురగలు కక్కుతూ పారే ఆ నదీ సోయగం చూడవలసిందే. మూసీ పక్కనే వలిగొండ - అరూరుల మధ్యన ఉన్న చెరువు అందమూ ఆస్వాదించదగిందే. ఈ చెరువు పెద్దదే. ఇందులో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తే మరీ బాగుంటది. అయితే, మత్స్యగిరి ఎక్కిచూస్తే మన చుట్టూ గొలుసు కట్టు చెరువులు ఏడెనిమిది కనిపిస్తయి.

వలిగొండ చెరువును దాటిం తర్వాత గుట్టలు వింత ఆకారాలతో మనల్ని తన్మయుల్ని చేస్తయి. మొదటగా చెరువు ఒడ్డున కనిపించే చిన్నగుట్ట అందం మనల్ని కట్టి పడేస్తది. అందుకు కారణం...చెరువుపై నుంచి వీచే చల్లగాలులకు అది కేంద్రం కావడమే కాదు, దానిపైన ఉన్న వేయేళ్ళ నాటి ప్రాచీన చెన్నకేశవాలయం సౌందర్యం ఆ చెరువులో ప్రతిఫలించడం!

ఆరూరు దాటిన తర్వాత మత్స్యగిరికి మళ్ళే ముందు రోడ్‌పై నిల్చుని చూస్తే కనిపించే గుట్టల అందం అజరామరమైంది. ‘మాలగుట్ట’, ‘మత్స్యగుట్ట’ల మధ్య గుండ్రని ఎత్తైన ‘కొచ్చెగుట్ట’ పానవట్టంలోని శివలింగం లాగా సహజ సౌందర్యంతో శోభిల్లుతోంది.

మత్స్యగిరిపైకి ఇటీవల ఒక దాత గార్లపాటి సురేందర్‌డ్డి కోటి రూపాయలతో వేయించిన ఘాట్ రోడ్డు పచ్చని చెట్లమధ్య పారే నల్లని తాచుపాములాగా వంకర టింకరగా మెలికలు తిరుగుతూ మనల్ని అలరిస్తది. ఈ రోడ్డుకు వ్యతిరేక దిశలో...పశ్చిమం నుండి మత్స్యగిరి పైకి ఇప్పుడిప్పుడే నిర్మాణమవుతున్న రోడ్డు ఎర్రని మట్టితో గిరి అందానికి మరో రంగును అద్ది ఆకర్శింపజేస్తున్నది.

మత్స్యగిరికి తూర్పు - పడమర పాదాల్లో ఉన్న పల్లెలు వేములకొండపల్లె, ఆరూరుపల్లె, వాటి పరిసరాల పంటచేలు, తాటిచెట్లు, పశువుల మందలు - ఇవన్నీ గిరి ఔన్నత్యం ముందు చిన్న అంశాలుగా కనిపిస్తూ, మనకు విమానం లోంచి కిందికి చూస్తున్న అనుభూతిని కలిగిస్తయ్.

ప్రస్తుతం కనిపిస్తున్న శివాలయం మొదట జైన బసది కాగా సుమారు 12వ శతాబ్దంలో..అంటే కాకతీయుల కాలారంభ దశలో శివాలయంగా మార్చబడిందని దాని వాస్తు శైలిని బట్టి తెలుస్తోంది. ఈ ఆలయ మంటపం చూడదగింది. ఆలయంలోని శివలింగం ప్రస్తుతం ఆలయానికి ఎదురుగా ఉత్తరంలో ఉన్న సహజ కోనేరులో పడి ఉంది. నంది విగ్రహం మత్స్యగుండంలో మునిగిపోయింది. ప్రధానాలయానికి ఉత్తరం దిశలో ఈ మధ్యనే హనుమాన్ ఆలయం కట్టారు. ప్రధానాలయానికి ఎగువన (పడమర) తొలి చాళుక్యుల నాటి నకీ.శ. 600 ప్రాంతం) ఆలయముంది. కాగా, ప్రధానాలయానికి ముందున్న కోనేరుకు ఎదుట తూర్పు దిశలో పెద్ద 16 కాళ్ళ నవరంగ మంటపాన్ని కడుతున్నరు. టోల్‌గేట్ దగ్గర సీతారామాలయం ఈ మధ్యనే పూర్తయింది. ఈ ఆలయం వెనుక, దీనికి చేరే ముందు ఒకప్పటి ప్రాచీన ప్రవేశ మార్గాలు ఇప్పుడు శిథిలమైనా ఆసక్తిని రేకెత్తిస్తున్నయి. అక్కడ సత్రాలున్నయి.

మత్స్యగుండంలోని చేప ముఖం ఉగ్ర నరసింహుని రూపంతో ఉండడం గమనార్హం.
నిశ్చయంగా ఈ ప్రాంతం జైన మత ప్రాబల్యం గలదని చెప్పే శిలాశాసనం ఒకటి ఇక్కడికి దగ్గరలోని సైదాపూర్‌లో లభించింది. అందులో అగ్గలయ్య అనే ఒక జైన శస్త్రచికిత్సకారుడు ఈ ప్రాంతంలోని ముచ్చనపల్లి, ఇక్కురికి అనే గ్రామంలో రెండు జైన బసదులను (మఠాలను) కట్టించాడని, ఆయనకు పశ్చిమ చాళుక్య రాజ్యంలో రాజుతో సమానమైన గౌరవం ఉందని రాసి ఉంది. ఈ రెండు బసదులకు స్థానిక గౌండు నగామాధికారి) క్రీ.శ. 1034 జూన్ 4వ తేదీన రెండు గ్రామాల భూములను దానం చేశాడు. ప్రస్తుతం మత్స్యగిరి పై ఉన్న శివాలయం, పొట్టిగుట్ట పైనున్న ఆలయాల నిర్మాణం ఆనాటి జైన బసదుల నాటిదే అంటున్నరు. శాసనంలో పేర్కొనబడ్డ ముచ్చనపప్లూయే తరువాతి శతాబ్దాలలో మత్స్యగిరి అయ్యింది.

పూర్వం ఒక వేటకాడు. మత్స్యగుండంలోని చేపలు పట్టి కూర వండుకోవడానికై వాటిని కోయగా అవి మళ్ళీ అతుక్కుపోయాయని వినిపించే స్థానిక కథ వెనుక కూడా అంతటి శస్త్ర పరిజ్ఞానం కలిగిన అగ్గలయ్య వంటి మేధావుల నేపథ్య కృషి ఉంది. అలాంటి వారే పాదరసంతో మత్స్యగుండం వంటి నీటి గుండాలను గుట్ట బండలపై కూడా ఏర్పరిచారని, ఒక ప్రత్యేకమైన చేప బ్రీడ్‌ను సృష్టించగలిగారన్నట్లు గౌరన ‘నవనాథ చరివూత’ ద్వారా తెలుస్తోంది. మత్స్యగుండంలోని చేప ముఖం ఉగ్ర నరసింహుని రూపంతో ఉండడం ఈ సందర్భంగా గమనార్హం.

మత్స్యగుండంలో చిన్న పెడల్ బోట్లను, వలిగొండ - అరూర్‌ల మధ్యనున్న పెద్ద చెరువులో మరబోట్లను ఏర్పాటు చేసి, దగ్గరలోని మూసీ నది వెంట ట్రెక్కింగ్ మార్గాన్ని కల్పిస్తే మత్స్యగిరి ఒక మంచి ‘ఎకో- టూరిజం స్పాట్’ కాగలదనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఇంతటి అపూర్వ దర్శనా స్థలం ఉండటం నిజంగానే విశేషం.

వ్యాసకర్త చరిత్ర పరిశోధకులు, ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్‌లో క్యూరేటర్, మొబైల్: 94909 57078

Tuesday 6 November 2012

GaaDida jalapaatam published in Surya daily on 2-10-2012


‘గాడి’ద జలపాతం

గోదావరి నదికి అవతలి జిల్లా అదిలాబాద్‌, ఇవతలి కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో రాష్ర్టంలోనే అందమైన అడవులున్నారుు. గోదావరి లోయలో ఉన్న అడవులను తెలంగాణా గ్రీన్‌ వ్యాలీ అంటారు. ఈ గ్రీన్‌ వ్యాలీ అందం అదిలాబాద్‌ జిల్లాలో మరీ ఎక్కువ. అలాంటి అరుదైన, అందమైన అడవుల్లో మరింత అందమైన, అత్యంత ఎతైన జలపాతం ఉందని ఆ ప్రాంతం లోని ఒక్కరికి కూడా తెలియకపోవడం దురదృష్టకరం. అది తెలుసుకుందామనే నేను, నా మిుత్రలు బుచ్చిరెడ్డి, ప్రవీణ్‌, దేవేందర్‌ త్రిపాఠి కలిసి అక్కడికి వెళ్ళాము.

అలసట కలగకుండానే, ఏ ప్రయత్నమూ చేయకుండానే ఎంతో అద్భుతమైన దృశ్యం కనిపించినా మనకు అంత ఆనందం అనిపించదు. అదే దాని అందాన్ని మనం వెతికి పట్టుకునే ప్రయత్నం కొంత చేసి సఫలీకృతమైనప్పుడు కలిగే ఆనందం ఒక మధుర సృతి అవుతుంది. మాకు ఈ గ్రీన్‌ వ్యాలీలోని ‘గాడి’ద గుండాన్ని చేరుకుని చూసినప్పుడు మిగిలింది ఈ మధర సృతి. అంటే గాడిద గుండం దర్శనం ప్రకృతితో మమేకమయ్యే అవకాశాన్నిచ్చి అదొక మధురస్మృతిగా మిగిలేందుకు దోహదం చేసింది. 

గ్రీన్‌ వ్యాలీలో ట్రెక్కింగ్‌
gaaDaహైదరాబాద్‌ నుండి నిర్మల్‌, నేరేడిగొండ, తర్నం లేదా దేవల్‌నాయక్‌ తండల మీదుగా ప్రయాణిస్తే 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గాడిదగుండం జలపాతం. దీన్ని చేరడానికి పచ్చని అడవులు, గుట్టలు, లోయల్లో మూడు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో కడెంనది ఒక్కోసారి వరద ఎక్కువై దాటనివ్వదు. మాకు ఇదే పరిస్థితి ఎదురైంది. అందుకని మేము దేవల్‌ నాయక్‌తండా దాటి, సమీప గ్రామస్థుడు కిషన్‌ను తీసుకుని ఈ జలపాతం దగ్గరికి వెళ్ళాం. ఐతే ఇక్కడికి నిర్మల్‌, ఇచ్చోడ, సిరిచెల్మ, పట్టణం, గుండిబాగ్‌ల మీదుగా వాహనంలో కూడా రావ చ్చునట. ఈ ప్రాంతంలో మరాఠీలు, లంబాడీలు, గోండులు, ఆంధ్‌లు, ముస్లింలు మ్త్రామే కాకుండా గిరిజనేతరులు కూడా ఉన్నారు. 

అంటే ఈ ప్రాంతంలో విభిన్న జాతుల సమ్మేళనాన్ని, వైవిధ్య సంస్కృతులను...భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడవచ్చు. కొందరు ఈ జలపాతాన్ని ముక్కిడి గుండం అని పిలిస్తే, మరి కొందరు గాడిద జలపాతం అంటారు. నిజానికి స్థానిక ప్రజలు ఈ జలపాతానికి మొక్కుతారు. అందుకే దీన్ని ‘మొక్కుడు గుండం’ అని, ఇది ‘గాడి’లో నుంచి దుముకుతుంది కాబట్టి ‘గాడి’ద గుండం అని పేర్లు వచ్చాయి. 

పర్యాటకులు ఈ ప్రాంతీయులు సాగు చేసుకుంటున్న పంట పొలాలు మధ్య నుండి నడచిపోవాల్సి ఉంటుంది. మన చుట్టూ ఎత్తు పల్లాల్లో గుట్టలు, చెట్ల మధ్య అటవీ ప్రదేశాన్ని చదును చేసు కుంటూ వివిధ రకాల మెట్ట పంటలను సాగు చేసుకుంటున్న వ్యవసాయదారులు కనిపిస్తారు. సౌంద ర్యమే కాకుండా పచ్చని లోయల్లోని నల్లని నేలల్లో పరుచుకున్న పచ్చని పైరుల సోయగాలను కూడా చూడొచ్చు. 

అక్కడక్కడా గుట్టబోర్లు, ఎతైన గుట్టలు, అడవులు, లోతైన లోయలు, ఇరు కైన దారి, ఎడ్లబళ్ళ చక్రాల గాడులు, పచ్చని చెట్ల మధ్య చిన్న, చిన్న కుంటలు, వాటి నీటిని తాగడానికి వచ్చిన జంతువుల కాళ్ళ డెక్కల గుర్తులు, జల జలా పారుతూ మనకు అడ్డంగా వచ్చే ఏరులు, పచ్చిక బయళ్ళు మేస్తున్న పశువులు, వాటిని కాపలా కాసే గోండులు, ఆంధ్‌లు, అటవీ మార్గంలో ఎలుగుబంట్లు, అడవిపందులు ఎదురవుతాయేమోనన్న భయం. వీటిల్లో ప్రతి ఒక్కటీ మన మనోఫలకంపై ముద్రించుకుపోయే మధుర స్మృతులను మిగుల్చుతాయి. 

ఎతైన, లోతైన జలపాతం
గాడిదగుండం జలపాతం పరిసరాలే మనల్ని పరవశానికి గురిచేస్తాయి. చుట్టూ గిరిగీసినట్లుండే ఎతైన పచ్చని కొండల మధ్య వంపు తిరిగిన వ్యాసంలా ఒక వాగు ప్రవహిస్తుంది. అదీ ఒక ఇరుకైన గాడిలో. చిక్కని ఎతైన చెట్ల మధ్యలో, గుండిబాగ్‌ అనే అంధలగూడెం సరిహద్దుల్లో పచ్చని చెట్ల మధ్య నుండి తెల్లని వాగు వడివడిగా ప్రవహిస్తుండటం చూసి పరవశించిపోతాం. అంత కంటే పరవశించే దృశ్యం అల్లంత దూరంలోనే కనిపిస్తుంది. అదే అసలైన అందమైన జలపాతం. అలాగని దాని అందం అంత సులభంగా కనిపించదు. వినిపిస్తుంది. 200 అడుగల ఎత్తు నుండి దూకే శబ్దం. ఇది మనరాష్ర్టంలోనే ఎతైన జలపాతాల్లో ఒకటి. 

ఈ జలపాతం ఒక ఇరుకైన గాడిలో నుండి కొండల మధ్య సహజంగా ఏర్పడిన ఒక నిటారైన రంధ్రంలోకి దూకుతుంటుంది. నిజానికి ఆ రంధ్రం ఈ జలపాతం దూకుడు తాకిడికే ఏర్పడింది. ఆ రంధ్రం ఎత్తు, లోతు సుమారు 100 అడుగుల పైమాటే. అంటే ఈ జలపాతం ఎత్తులో సగం భాగం అన్నమాట. జలపాతం ఈ రంధ్రంలో దూకిన తరువాత మనకు కనిపించకుండా మాయమవుతుంది . తూర్పు వైపు నుండి పడమర వైపు దూకుతున్న జలపాతం ఆ రంధ్రాన్ని చీల్చుకుని ఉత్తర వాయువ్యం వైపు బయటకు వెళ్ళి మళ్ళీ గుట్ట అడ్డు రావడంతో మలుపు తీసుకుంటుంది. అదొక అందమైన ఆసక్తికరమైన దృశ్యం. ఇక్కడే మనకు తెలియని మరో ఆసక్తికరమైన దృశ్యం కనిపిం చింది. అదేమిటంటే, కొందరు స్థానిక వేటగాళ్ళు పావురాలను పట్టుకోవడం. 

సుందరమైన లోయ
jalapaaaగాడిదగుండం జలపాతం ప్రాంత దృశ్యం కాశ్శీర్‌ లోయను మరిపిస్తుంది. ఈ జలపాతం చుట్టూ 500 అడుగుల ఎతైన కొనదేలిన కొండల వరుసలు పచ్చని చెట్లతో కళకళలాడుతూ ముసురుకు న్నాయి. ఈ కొండల మధ్య తూర్పు సగభాగం ఎతైన పీఠ భూమి, పశ్చిమ సగభాగం ఏటవాలు లోయ. ఎంతో అందంగా కనిపిస్తుంది. పీఠభూమిని ఈశా న్యం కొండల మధ్య సన్నని చీలక నుండి, దక్షిణపు కొండల గుండిబాగ్‌ ఏటవాళ్ల నుండి చేరుకో వాలి. లోయనైతే పశ్చిమపు కొండలు (మాదా రం) దిగి చేరుకోవాలి. వర్షాలు ఉధృతంగా లేన ప్పుడు కడెం నది మనల్ని దాటనిస్తుంది. 

అప్పుడు ఈ లోయ లోని తర్నం, దేవల్‌నాయక్‌తండా పొలి మేరల నుండి కాలినడకన చేరుకోవచ్చు. ఇలా వచ్చిన ప్పుడు జలపాతం కింద ఉన్న లోయ లోకి చేరుకుంటాం. జలపాతం ఎత్తు, అందాన్ని సంపూర్ణంగా చూసి ఆనందిచవచ్చు. పీఠభూమిపై నుండి వస్తే దాని ఎత్తు సగమే కనిపిస్తుంది. 500 అడుగుల ఎత్తున్న పచ్చని కొండల మధ్య ప్రవహిస్తూ, 200ల అడుగుల ఎత్తు నుండి తూర్పు నుండి పశ్చిమం వైపు దూకుతూ, 100 అడుగుల ఎతైన నల్లని రాళ్ల మధ్య కనుమరగయిన తెల్లని జలపాతం మళ్ళీ ఉత్తర వాయువ్యంలో కొండ అడ్డు రావడంతో వంపు తిరిగి పశ్చిమం మీదుగా నైరుతి వైపు అర్థచంద్రాకారంలో నీలిమేఘాలను ప్రతిఫలిస్తూ ఒయ్యారంగా సోయగాలు పోతు ప్రవహించే దృశ్యాన్ని ప్రతిఒక్కరూ చూసి తరించాల్సిందే. 

మాదారం నుంచి గాని, తర్నందేవల్‌ నాయక్‌ తండా మీది నుంచి గానీ వచ్చేవారు జలపాతం కిందుగా పారే వాగు ప్రవాహం వెంట సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం పచ్చని చెట్ల మీద చేస్తున్న పక్షుల కిలకిల రావాలను వింటూ నడక సాగిచడం మన జీవితంలో మరిచిపోలేని మధురానిభూతిని మిగులుస్తుంది. ఇక్కడ రోప్‌వే నిర్మిస్తే ఇదొక అద్భుతమైన ఎకో టూరిజం ప్రాజెక్ట్‌ కాగలదు. జాతీయ రహదారి నెం.44కు దగ్గరగా ఉండటం వల్ల పర్యాటకులతో కిటకిటలాడే అవకాశమూ ఉంది.

ఈ జలపాతం ఒక ఇరుకైన గాడిలో నుండి కొండల మధ్య సహజంగా ఏర్పడిన ఒక నిటారైన రంధ్రంలోకి దూకుతుంటుంది. నిజానికి ఆ రంధ్రం ఈ జలపాతం దూకుడు తాకిడికే ఏర్పడింది. ఆ రంధ్రం ఎత్తు, లోతు సుమారు 100 అడుగుల పైమాటే. అంటే ఈ జలపాతం ఎత్తులో సగం భాగం అన్నమాట. జలపాతం ఈ రంధ్రంలో దూకిన తరువాత మనకు కనిపించకుండా మాయమ వుతుంది. తూర్పు వైపు నుండి పడమర వైపు దూకుతున్న జలపాతం ఆ రంధ్రాన్ని చీల్చుకుని ఉత్తర వాయువ్యం వైపు బయటకు వెళ్ళి మళ్ళీ గుట్ట అడ్డు రావడంతో మలుపు తీసుకుంటుంది. అదొక అందమైన దృశ్యం. ఇక్కడే మనకు తెలియని మరో ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. అదేమిటంటే, కొందరు స్థానిక వేటగాళ్ళు పావురాలను పట్టుకోవడం.
డా. ద్యావనపల్లి సత్యనారాయణ, 9440687250

Monday 27 August 2012


రామాయణ కాలపు జలపాతాలు
పర్యాటకంలో అన్ని వర్గాల వారికీ అమితానందాన్నిచ్చేవి జలపాతాలు. కాని అవి మన రాష్ట్రంలో తక్కువగా ఉండి పర్యాటకంలో జలపాతాల లోటు ఉంది అనుకుంటున్నాం. కాని బాగా తెలుసుకుంటే ఒక్క కరీంనగర్‌ జిల్లాలోనే... అదీ ఒక్క మండలంలోనే మూడు జలపాతాలున్నాయని తెలసి ఆశ్చర్యానికి గురై ఆనందించేందుకు బయలుదేరాం నేను, నా మిత్రలు దేవేందర్‌ త్రిపాఠి, ఇందూరి ప్రవీణ్‌, గడ్డం అనిల్‌. స్థానికులు సునిల్‌, అనిల్‌రెడ్డి, రమణారెడ్డిలు మా ప్రయాణాన్ని సుగమం చేశారు.

మేము దర్శించి హర్షించిన జలపాతాలు గౌరీ గుండం జలపాతం, దాని పరిసర గుండాలైన సీతమ్మ కొల్లుగుంట, పులిగుండం మరియు రాముని గుండాలు. ఇవన్నీ రామగుండం పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. వీటన్నిటికీ రామాయణ కాలపు నేపథ్యగానాలున్నాయి. మొదటి మూడు గుండాలు హైదరాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, సబ్బితం మీదుగా ప్రయాణిస్తే 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైన గౌరీ గుండం సులువుగా చేరుకొని ఆనందించడానికి అనువుగా ఉంది. ఇక రాముని గుండాల హైదరాబాదు నుండి పెద్దపల్లి, రామగుండం బి-పవర్‌హౌజ్‌ గడ్డ మీదుగా ప్రయాణిస్తే 210 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గమ్మతె్తైన గౌరీ గుండం
G-(4)సబ్బితం నుండి గట్టుసింగారం వైపు కచ్చారోడ్‌ మీద ప్రయాణిస్తున్నప్పుడు మనకు అడ్డంగా దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు కొనసాగుతున్న కొండల వరుస పచ్చని అడవులతో కళకళలాడుతూ కనిపిం చి కనువిందు చేస్తుంది. మనం ఆ కొండలకు దగ్గరవుతున్నకొద్దీ ఆ పచ్చని కొండల మధ్యనున్న ఒకే ఒక నల్లని లోయ మన దృష్టిని ఆకర్షి స్తుంది. ఆ నల్లని లోయ మీద దృష్టి నిలుపగానే కొండ లపై నుండి ఆ లోయలోకి దుముకుతూ కనిపించే తెల్లని జలపాతం మన ఉల్లమును జల్లనిపి స్తుంది. ఆ సుందర దృశ్యానికి తోడు ఆ జలపాతపు హోరు మన ఉత్సాహాన్ని ఉరకలు పెట్టి స్తుంది. ఇక ఆగితేనా! మాలో ఒకర్ని విడిచి ఒకరు ఉరుకులు పరుగుల మీద ఆ జలపాతాన్ని చిటికెలో చేరుకున్నాం.సుమారు 150 అడుగుల ఎత్తున కొండల వరుస శిఖరాగ్ర మధ్య భాగం నుండి... అంటే సుమారు 70 అడుగుల ఎత్తు నుండి పశ్చిమాభిముఖంగా ‘సుయ్‌’ మని సూటిగా నింగి నుండి నేలకు దుముకుతున్న సుందర దృశ్యం ఈ జలపాతం సొంతం. 

నయనానందకరం దాని పరిసరం. 
వీనుల విందు దాని పొందు. 
కరచరణ స్ఫూరితం దాని చరితం. 
స్వరపేటిక ప్రేరితం దాని పాటవం.
కవి కలానికి ఇంపు దాని సొంపు. 

దాని సోయగాన్ని చూసి, దాని నడక సవ్వ డిని విని, దాని కింద తడిసి ముద్దయితే తప్ప ఆనందానికి నిర్వచనం లేదనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే, మేము అలాంటి ఆనందానికి పాత్రులమయి చెప్పున్న విషయాలివి.జలపాతపు తెల్లదనమే దాని కింద ఏర్పడిన గుండంలో కూడా కనబడడం, పైగా ఆ గుండం ఎనిమిది అడుగుల కన్నా ఎక్కువ లోతు లేకపోవడంతో ముందుగా మేము అందులోకి దిగి స్నానాలు చేశాం. ఈత కొట్టాం. కేరింతలతో క్రమక్రమంగా ముందుకి వెళ్లి జలపాతపు ధార కిందికి చేరాం. 

మా తల, వీపులపై నురగలు గక్కుతూ గమ్మతుత్గా దుముకుతున్న జలధారల స్పర్శానుభూతికి పరవశులమయ్యాం. చిన్నపిల్లలమై మరింత స్వరం పెంచి కేరింతలు కొట్టసాగాం. ఐదు నిమిషాల తర్వాత అకస్మాత్తు జలపాతపు ప్రవాహం పెరిగింది. మొదట భయపడ్డాం. బయటికి పెరుగెత్తుకు రావాలనుకుంటుండగానే మరో వింత జరిగింది. మళ్ళీ అకస్మాత్తుగా జలపాతం తడవలు తడవలుగా చల్లగా ఓసారి, వెచ్చగా ఓసారి పడటం ప్రారంభమైంది. అది గమ్మతె్తైన వింత అను భూతినివ్వ సాగడంతో ఏమైతే అదవుతుందని అలా ఆనందిస్తూ దాని కిందే ఉండిపోయాం. త్రిపాఠిగా రయితే ‘ఇలా జలపాతం కింద ఉంటే అరగంటలో అద్భుతమైన నీటి మసాజ్‌ అయ్యి చర్మ రోగా లన్నీ మాయమౌతాయి’ అని కితాబిచ్చారు. ప్రవీణ్‌గారు ఫోటోల్లో ఆ అనుభూతులను బంధించారు. అయితే నిజానికి సబ్బితం గ్రామస్థులు చెప్పినట్లే... మా కేరింతల శబ్దాల ప్రతిధ్వనులు చుట్టూ ఉన్న గుట్టల్లో ప్రకంపనలు పుట్టించి వాటిల్లో నిక్షిప్తమైన వెచ్చని నీటిని బయటికి లాగాయని అర్థమైంది.

పరిసరాల పారమ్యం
G36ఈ జలపాతం కుడివైపు ఉత్తరాన ఉన్న గుండుకు గౌరీ విగ్రహం చెక్కించ బడి ఉండడంతో ఆ దేవత పేరు మీదనే ఈ జలపాతానికి గౌరీ గుండం అనే పేరొ చ్చింది. దాని పక్కనే వినాయక విగ్రహముంది .ఈ మొత్తం శిల్ప సముదాయం సప్తమాతృ కలకు సంబంధించింది అయ్యుంటుంది. జలపాతానికి ఎడమవైపు దక్షిణాన 15 అడుగుల ఎత్తున గుట్టలో పలికి నిలువెత్తు గుహను తొలిచి, మూడు స్తంభాలపై ఆలయ పైకప్పు ఉన్నట్లు తీర్చిదిద్ది ఆలయం లోపల ఈశాన్యం మూలలో త్రిమూర్తుల రేఖా చిత్రాలను, మధ్యలో శివలింగాన్ని చెక్కారు. స్తంభాలు అజంతా స్తంభా లను పోలి ఉన్నాయి కాబట్టి, ఈ ఆలయ చరిత్ర సుమారుగా వేయిన్నర సంవత్స రాలనాటిదని చెప్పవచ్చు. ఆలయం ముందు వాయువ్యంలో జలపాతం తుంపర్లలో తడు స్తున్న బండకు పద్మా సన స్థితిలో కూర్చున్న జైనమాత తీర్థంకర విగ్రహం, దానికి కుడివైపున నాగబంధం, నెమలి, సూర్యచంద్రుల శిల్పాలు చెక్కి ఉన్నాయి. 

ఈ ఆలయ సముదాయ శిల్పాలను స్థానికులు గొల్లభామలు అంటున్నారు. జలపాతపు కొండపైన శిధిలమైన ‘బయ్యన్నగుడి’ అనే జైన దేవాలయం ఉంది. ఈ జైన వాస్తు శిల్ప సాంప్రదాయం రాష్టక్రూట రాజుల కాలానిది (క్రీ.శ. 10-11 శతాబ్దాలది) అయ్యుంటుంది. బయ్యన్నగుడికి అల్లంత దూరంలో ‘మామిడికుంట’ అనే చెరువుంది. దాని పరిసరంలో సుమారు రెండు వందల ఎకరాల భూమి ఉంది. దాన్నంతటినీ సాగు చేయవచ్చు. కాబట్టి ఈ మధ్య కాలంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామస్థులకు కూలీలిచ్చి కొన్ని ఎకరాల భూమిని సేద్యయోగ్యం చేయించారు. ఫలితంగా ప్రస్తు తం సుమారు 20 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు కూడా. అక్కడికి వెళ్ళేందుకు కూడా కొండ మీదకి ఏటవాలును బట్టి రైతులు, పశువులు వెళ్ళే మార్గం కూడా ఏర్పరచుకు న్నారు. కొండపైన ఇలా వందల ఎకరాల సమతలం ఉండడం, మిగతా ప్రపంచంతో మాత్రం సంబంధం లేకుండా ఉండడం. ఇవన్నీ చూస్తే ‘ఆకాశంలో ఐలాండ్‌’ను చూస్తున్నట్లుంది.ఇక ఓపికున్నవారు ఈ జలపాతానికి దక్షిణాన కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘సీతమ్మ కొల్లుగుంట’ అనే గుండాన్ని, ఉత్తరాన ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ‘పులిగుండం’ అనే గుంఆన్ని కూడా చూడవచ్చు. వాటి ప్రాకృతిక సౌందర్యాన్ని చూసి వాటి వద్దకు నడిచిన శ్రమను మరచిపోతాం.

రాముని గుండాలు
G66రామగుండం పట్టణానికి ఆ పేరు రావడానికి కారణం ఆ పట్టణంలో ఉన్న గుట్టపైనున్న ‘రామగుం డం’ అనే చెరువు. ఈ చెరువు కొన్ని కిలోమీటర్ల పొడ వుతో దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు కొనసాగుతున్న కొండ వరుస మధ్యలో ఉంది. వర్షాలు ఎక్కువైనప్పుడు ఆ చెరువు నిండి పొంగే ప్రవాహం ఉత్తరం వైపుకు లోయ మార్గంలో ప్రవహిస్తూ ఒక కొండ కొన మెట్ల మీద నుంచి దుము కుతూ మూడు నాలుగు దఫాలుగా చిన్న చిన్న జలపాతా ల్లాగా దర్శన మిస్తుండి. ఆ జలపాతాల కింద రెండు నుంచి నాలుగు గజాల వ్యాసంతో అందమైన గుండాలే ర్పడ్డాయి. ఇవే ‘రాముని గుండాలు’. ఈ గుండాల్లో నిలబడి జలపాతాల కింద జలకాలా డడం మధురాను భూతినిచ్చింది. 

గుండాల ఒడ్డు మీద కూర్చుని గుండంలోకి కాళ్ళు జారవిడిచి ఆ నీళ్ళల్లో ‘చలక్‌ చలక్‌’ మని కొట్టడం.. నడవడం... ఒకరిపై ఒకరు నీళ్ళు జల్లుకోవడం... ఈ చిలిపి చిన్నారి పనులన్నీ పెద్దలకు కూడా ఇక్కడ సాధ్యమే.గుండాల్లో నుంచి పారుతున్న నీళ్ళన్నీ ఇరుకైన రాతి లోయలో నుంచి తూర్పు వైపున కుంటలోకి చేరుతున్నాయి. రెండు గుట్టల పదాల మధ్య ఆ కుంట చాలా అందంగా కనిపిస్తుంది. ఆ అందాన్ని మరింత ఆస్వాధించాలం టే ఆ కుంటలో చిన్న చిన్న బోట్లు ఏర్పాటు చేయాలి. కొండ పైనున్న గుం డంలో కూడా ఈ ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతానికైతే కొండ పైనున్న ఈ గుండం వరకు ఒక కిలోమీటరు దూరం వరకు ట్రెక్కింగ్‌ చేసి ఆనందించవచ్చు.

పరిసరాల వైశిష్ట్యం
రాముని గుండాల వైపు వెళ్తున్నప్పుడు గుట్ట కింద తూర్పుకాభిముఖంగా ఒక వీరగల్‌ విగ్రహ ముంది. స్థానిక ప్రజల సంరక్షణ కోసం శత్రు సైన్యాలతో యుద్ధం చేసి వీరమరణం పొందినవారి త్యాగాన్ని స్మరించుకోవడం కోసం మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం వరకు ఇలాంటి వీరగల్‌ విగ్రహాలను ప్రతిష్టించేవారు - సాధారణంగా యుద్ధం జరిగిన ప్రదేశంలోనే. ఈ విగ్రహానికి ఇప్పుడేమో భక్తులు జాజు పూసి దాన్ని హనుమంతుడుగా పేర్కొంటున్నారు. ఈ వీరగల్‌ విగ్రహం దాటి కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే ఆరు అడుగుల ఎతె్తైన ఏకశిలా వినాయక విగ్రహ ముంది. అది ఈ మధ్యనే వర్షాల వరదలో గుట్టపై నుండి కిందికి దొర్లి పడిందట. ఆ విగ్రహ శైలీ విశేషాలను బట్టి అది కనీసం వేయి సంవత్సరాలకు ముందటిదని అర్థమువుతుంది.

వినాయక విగ్రహంలాగే కొండ మీద వేంకటేశ్వర విగ్రహం కూడా బయటపడిందట. అక్కడికి వినా యక విగ్రహం దాటి కొండ ఎక్కి వెళ్ళాలి. ఆ విగ్రహానికి ఆలయం కట్టించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముందుకొచ్చారట. కాని స్థానిక నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ వారు ఆ పనిని తామే చేస్తామని ముందుకొచ్చి మూడు కోట్ల రూపాయలతో ప్రస్తుతం కొండపైకి రోడ్లు వేయిస్తున్నారు. కొండ శిఖరాగ్ర భాగాన ఒక అందమైన శిలా మండపం ఉంది. దీన్ని గౌరీ మంటపం అంటున్నారు. ఇది రోడ్‌ మీద ప్రయాణించే ప్రయాణికులకు కూడా కనిపిస్తుంది. ఈ రాముని గుండాల రాతి గుట్టలు చాలా ప్రత్యేకమైనవి, అరుదైన అందంతో అరారుతున్నవి. 

చాలా భాగం వరకు చెట్లు లేకుండా ముడి ఇనుప గుట్టల్లాగా కన్పిస్తాయి. వీటిల్లో అక్కడక్కడా గుహలేర్పడ్డాయి. వాటిలో విగ్రహాలను పెట్టి వాటి చుట్టూ చిన్న చిన్న దేవాలయాలు కట్టారు. మొదట ఈ ప్రాంతం నాగజాతి వారిదేమో - అందుకే నాగశిల్పాలు అరడజనుకు పైగా వివిధ రూపాల్లో ఉన్నాయి. తరువాత ఇక్కడికి రాముడు వచ్చిన నిదర్శనంగా ఇక్కడ ప్రధాన రామాల యం ఉంది. ఇక్కడి గుండాల్లో రాముడు సీత ఆనందించారనడానికి నిదర్శనంగా ఇక్కడ రాముడు -సీత ఆలింగన శిల్పాలు అరఫీటు ఎత్తుతో కన్పిస్తున్నాయి. రామాలయం పక్కన రామానుజస్వామి విగ్రహముంది. దాని పక్కన ఒక గుహాలయముంది. 

ఈ ఆలయాలకు ముందు శైవ శాక్తేయ మత విశిష్టతను విశదపరిచే నంది, లింగం, కాలభైరవ, శక్తి తదితర శిల్పాలు, దేవాలయాలున్నాయి. వీటిల్లో ఎక్కువ శాతం కళ్యాణి చాళుక్యుల కాలంలో (క్రీ.శ. 10-11 శతాబ్దాలు) కట్టినట్లు వాస్తు విశేషాలనుబట్టి తెలుస్తోంది.ఇలా చారిత్రక ప్రాకృతిక సౌందర్యాలకు ఆలవాలమైన ఈ గౌరీగుండం, రాముని గుండాల జలపాతాలు ప్రకృతీ ప్రియులను అలరిస్తాయనడంలో అనుమానం లేదు.

- డా ద్యావనపల్లి సత్యనారాయణ, 9440687250

Friday 17 August 2012

Thirumalanathakonda published in Surya on 14-08-2012


తిరుమలనాథ కొండ
పశ్చిమ దేశాల్లో ఉన్నట్లుగా మనదేశంలో కూడా ఇటీవలి కాలంలో వారాం తపు పర్యటనల ప్రాముఖ్యం పెరుగుతున్నది. ముఖ్యంగా నగరాల్లో... ప్రత్యేకించి ఉద్యోగ కుటుం బాల్లో అరుుతే, ఒకటి రెండు రాషాట్రలు మినహా మిగతా అన్ని రాషాట్రల్లోనూ వారానికి ఆదివారం ఒకటే సెలవురోజు. మరి ఈ ఒక్కరోజు వెళ్ళి వచ్చే పర్యాటక స్థలాలు... నగరాల చుట్టు ఎన్ని ఉన్నారుు?’ అనే ప్రశ్నకు సమాధానం అలాంటి స్థలాలు చాలా అరుదుగా ఉన్నారుఅని వస్తుంది. అలాంటి అరుదైన పర్యాటక స్థలాల్లో ఒకటి తిరుమలనాథ కొండ’.
తిరుమలనాథ కొండ మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం పెద్ద రేవళ్ళ గ్రామ పరిధిలో ఉంది. హైదరా బాద్‌ నుండి బాలానగర్‌ మీదుగా ఈ ప్రాంతానికి 80 కిలోమీ టర్లు. ప్రకృతిని ఇష్టపడేవారు షాద్‌నగర్‌, బూర్గుల మీదుగా వెళ్తే 70 కిలోమీటర్లు. అయితే రెండవ దారిలో వెళ్ళేవారు సుమారు 10 కిలోమీటర్లు కచ్చా రోడ్డు మీద వెళ్ళవలసి ఉం టుంది. ప్రకృతిని ఎంతో ఇష్టపడే నేను... నా సీనియర్‌ మిత్రు లు బుచ్చిరెడ్డి, దేవేందర్‌ త్రిపాఠీ కలిసి రెడ్డి గారి కారులో బూర్గుల మీదుగానే వెళ్ళాము.
ప్రకృతి సోయగాల నడమ
బూర్గుల గ్రామ పరిసరాలు చాలా అందంగా ఉంటాయి. నిజా నికి వర్షాకాలంలో పంటలతో పచ్చగా అలరారవలసిన బూర్గు ల భూములు బీడుపోయి వర్షానికి పచ్చని గరిక గడ్డి సమానం గా పెరిగి కావాలసి పెంచిన లాన్‌లలాగా కనిపిస్తాయి. గుట్టబో ర్ల ఏటవాలుల్లో రైతులు మలుచుకున్న చిన్నచిన్న పంటమడు లు అలా గరిక గడ్డితో పచ్చని రంగు పులుముకొని ఊటీ, అస్సాం టీ, కాఫీ పైరులను తలపిస్తాయి. ఆ మడుల మధ్య పల్లం వైపు చిన్నచిన్న నీటి ఏరులు ప్రవహిస్తున్నాయి. ఆ పచ్చ ని మడుల మధ్యే అక్కడక్కడా తెల్లతెల్లని ఆవుల మందలు, నల్ల నల్లని బర్రెల మందలు, గొర్రెల మందలు పచ్చిక మేస్తూ తిరుగాడుతాయి. ఇవన్నీ చూశాక ఇక ఊటీ వెళ్ళడం దండగ అనిపిస్తుంది.

ఇక తిరుమలనాథ కొండ ఎక్కిన తరువాత మనల్ని మనం మరచిపోక తప్పదు. అంత అందంగా ఉంటాయి దాని పరిస రాలు. తిరుమలనాథ కొండ చుట్టూ సుమారు పది కొండలు న్నాయి. వాటిలో అన్నింటి కన్నా పెద్దది ఇదే. కాబట్టి ఈ కొండ పైకి ఎక్కితే మిగతావి చిన్న కుప్పల్లాగా అందంగా కనిపిస్తాయి. ఈ కొండ వాయువ్యంలో ప్రారంభమై ఒక లోయ ఆగ్నేయం వైపు అలవోకగా సాగిపోతుంది. ఆ లోయలో ఏపుగా పెరిగిన ఎర్రని భూముల మధ్య పచ్చని వలయం లాగా ఒక చిత్రకా రుని కాన్వాస్‌పై పెయింటింగ్‌లా కనిపిస్తాయి. వాటి పైనుంచి వీస్తున్న ఈదరగాలి మన ముంగురులను, దుస్తులను రెపరెప లాడిస్తూ గిలిగింతలు పెడుతుంది. కొండ శిఖరం పైకి ఎక్కి కొండకు తూర్పున కొనసాగుతున్న కచ్చా రోడ్డును చూస్తే అది పచ్చని వెంట్రుకల (పక్కనున్న చెట్టతో కూడిన లోయ) మధ్య గోధుమ వర్ణము పాపిటలాగా అందంగా కనిపిస్తుంది.

వినోదం + విజ్ఞానం = ట్రెక్కింగ్‌
తిరుమలనాథ కొండ పైకి చేరుకోవాలంటే అక్కడక్కడా ఉన్న సమతలపు గుట్టబోర్లతో పాటు సుమారు 275 మెట్లు ఎక్కాలి. అయితే మెట్ల సంఖ్యను చూసి అమ్మో! అని భయపడనక్కర్లేదు. ఎందుకంటే, ఈ మెట్లు ఎత్తు తక్కువగా ఉంటాయి. పైగా మెట్లకు ఇరువైపులా మనకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచే ఎన్నో వింతలు, విశేషాలు మనకు ట్రెక్కింగ్‌ అలసటను తెలియకుండా చేస్తాయి.
తిరుమలనాథ కొండ ప్రకృతి సౌందర్యంతో పవిత్రమైందన డానికి నిదర్శనంగానేమో మనకు ట్రెక్కింగ్‌ ప్రారంభంలోనే ఒక చిన్న ఏరు జలజలా పారుతూ ఎదురవుతుంది, మన పాదాలను ప్రక్షాళన చేస్తుంది. ఆ ఏరు చుట్టూ ఏడెనిమిది రాతి స్తంభాలు నిలబెట్టి ఉన్నాయి. వాటి దగ్గరికెళ్ళి చూస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఒక్కో స్తంభానికి నాలుగు వైపులు... ఒక్కో పక్క ఒక్కొక్క కథను లేదా పౌరాణిక ఇతివృత్తాన్ని తెలిపే నాలుగైదు శిల్పాలు ఒక్కో అడుగెత్తు చొప్పున చెక్కారు. ఇలాంటి స్తంభాలను శిల్పం నేర్చుకునేవారు గాని, దాతలు గాని చెక్కి(ంచి) ఉంటారు.
అలాంటి ఒక స్తంభానికి పులిని వేటాడుతున్న వీరత్వాన్ని, మ ద్దెల వాయిద్య నృత్యాలతో కళాకౌశలాన్ని ప్రదర్శిస్తున్న ఒక పురుషుడిని ప్రేమించిన ఒక యువతి, అతనికి పావురంతో తన
ప్రేమ సందేశాన్ని పంపి, అతని ప్రేమను గెలిచి, ఆచంద్ర తారార్కంగా పెళ్ళి చేసుకొని దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్న ట్లుగా శిల్పాలు చెక్కబడ్డాయి. అయితే చివరిదైన పురుషాయిత రతిశిల్పం వామాచార శాక్తేయ మత ప్రాభవాన్ని సూచిస్తుందేమో! ఇంకొక స్తంభ శిల్పంలో కృష్ణుడు కాళీయమర్ధనం చేస్తున్న దృశ్యం చెక్కబడింది. మరో స్తంభానికి మూర, గజం, జాన అనే కొలతలు చెక్కి ఉన్నాయి. ప్రాచీనకాలంలో స్థానిక రాజు ఆ ప్రాంతంలో భూములను తన మూర, జాన, గజం, బారెడు (రెండు గజాలు) కొలతలతో ప్రజలు కొలుచుకునేందుకు వీలుగా ఇలా అక్కడక్కడా ఏర్పాట్లు చేశాడట.

ఇలాంటి శిల్పకళాశోభితమైన స్తంభాలు దాటగానే మెట్లు కనిపిస్తాయి. మెట్లకు ఇరువైపులా చిన్న చిన్న రెయిలింగ్స్‌ ఉంటాయి. ఒక్కో రెయిలింగ్‌ రాయికి రెండు కొనల్లో రెండేసి గుంతలుంటాయి . ఆ గుంతల్లో పూర్యకా లంలో పర్వదినాల్లో నూనెపోసి, వత్తులు వేసి వెలిగించేవారట. ఎంతటి ఆసక్తిని రేపే ఏర్పాట్లో!అనుకుంటూ మెట్లు ఎక్కుతూ వెళ్తే మనల్ని మరింత ఆనందానికి గురిచేసే శిల్పాలు కనిపిస్తాయి. ఇవి మెట్లకు రెండు పక్కలా అక్కడక్కడా ఉన్న సహజమైన గ్రానైట్‌ శిలలకు చెక్కబడ్డాయి. ఇలాంటి శిల్పాల్లో ఎక్కువగా హనుమంతుడు వివిధ రూపాల్లో చెక్కబడ్డా డు.తమకు ఆపదలు తొలిగి సంపదలు కలిగినప్పుడు భక్తులు ఇలాంటి శిల్పాలను చెక్కించడం అనాదికాలంలో ఆచారంగా ఉండేది.

సహజ శిల్పసౌందర్యం
తూర్పు నుంచి పడమడివైపు సాగుతున్న మెట్ల మార్గమధ్యంలో ఎడమ వైపు పందిరి వేసినట్లు ఒక సహజ శిలాతోరణం ఉంది. దీనిలో పూర్వం ఒక దేవతా విగ్రహం ఉండేదన్నట్లు కనిపిస్తుంది. కనుకనే దాని చుట్టూ ప్రదక్షిణ పథం ఉంది. అదీ సహజ శిలలదే!ఈ సహజ శిలాతోరణం ముందు నిల్చుని ఉత్తరం వైపు చూస్తే ఊపిరి పీల్చుకుని, గుండెమీద చేయివేసుకుని అమ్మ ఎంత అందమైన శిలలుఅనిపించే సహజ శిలా శిల్పాలు ఎన్నో ఉన్నాయి. ఒక శిలా సముదా యంలో మొగ్గ విప్పిన రేకులతో కమలం, తిరునామాలు కనిపిస్తే...

మరో శిలా సముదాయంలో ఎత్తు మీదున్న కప్పను ఒక తాబేలు ఎగిరి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుంటుంది. ఇంకొక శిల ఎలుగుబంటి ఆకారంలో ఉంటుంది. ఇలాంటి సహజ శిలాకృతులు కొన్నింటిని హైద రాబాద్‌లోని శిల్పారామంలో చూస్తాం. అయితే అవి ఎక్కడినుండో తెచ్చి కృత్రిమ వాతావారణంలో పెట్టినవి. కాని ఈ తిరుమలనాథ కొండ మీద ఉన్నవి సహజవాతావరణంలో అత్యంత సౌందర్యంతో భాసిల్లుతు న్నాయి.

కోటగోడలు - యుద్ధపు ఆనవాళ్ళు
తిరుమలనాథ కొండ ప్రాంతం ఒక ప్రాంతీయ రాజ్య ప్రాధాన్యమున్న స్థలంగా కనిపిస్తుంది. కొండ ఎక్కడానికి ముందే ఒక వీరుని శిల్పం (వీరగల్‌), వీరధ్వజ స్తంభం కనిపిస్తాయి. వాటి ఆధారంగా అక్కడ ఈ మధ్య ఒక హనుమాన్‌ మందిరం కట్టారు. తమ ప్రజల సంక్షేమం కోసం శత్రుసైన్యాలపై పోరాడి వీరమరణం పొందినవారికి గుర్తుగా ఇలా వీరగల్లు శిల్పాలను చెక్కించే ఆచారం మూడు నాలుగువందల సంవత్స రాల క్రితం వరకూ మనుగడలో ఉండేది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎప్పు డు ఎవరెవరికి యుద్ధం జరిగిందో పరిశోధించవలసి ఉంది.

ఇక సహజ శిలా మండపం మొదలుకొని మనకు మెట్లెక్కుతున్నప్పుడు రెండు పక్కలా కోటగోడను నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మెట్లెక్క డం పూర్తయినాక సమతలంలో రెండు మూడు ఆలయాలున్నాయి. ఈ సమతలం చుట్టూ కోటగోడ ఉంది. అంటే దేవాలయాల చుట్టూ కోట గోడ కట్టారన్నమాట. అలాంటి రక్షణ గోడ కట్టడం వలన పశ్చిమాభి ముఖంగా ఉన్న ప్రధానాలయానికి ముందర రెండు సహజ కుంటలు ఏర్పడ్డాయి. మరో కోనేరును దానికి సమీపంలో కట్టారు. ఈ మూడు నీటి వనరులు యుద్ధ సమయాల్లోనూ, సాధారణ సమయాల్లోనూ ఈ కొండపైనున్నవారికి అవసరాలు తీర్చేవన్నమాట.

ప్రధానాలయ గోపురంలో కూడా నలుదిక్కులా శత్రువులో ఆయుధాలను ప్రయోగించే ఏర్పాట్లు (గూడులు) ఉన్నాయి. తెలుగు దేశంలో ముస్లింలు ప్రవేశిం చాక (14-16 శతాబ్దాల) వారి వల్ల హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందని, అందుకే వారి బారినుంచి తమ దేవాలయాలను రక్షించుకు నేందుకు హిందువులు వాటి చుట్టూ రక్షణ కోటగోడలను నిర్మించుకు న్నారని చారిత్రకులు చెబుతారు. అలాంటి ఏర్పాట్లనే మనం ఇక్కడ చూస్తాం.
ఆలయం వైచిత్య్రం
ప్రధాన దేవాలయం కాలక్రమంలో ఎన్నో మార్పుచేర్పులకు గురై విచి త్రంగా కనిపిస్తుంది.సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉంటే దీనికి మాత్రం పశ్చిమపు వాయు వ్య ద్వారాలు ప్రధాన ద్వారాలు కాగా ఉత్తరాభిముఖంగా రెండు ద్వారాలు, దక్షిణ ఆగ్నేయం లో మరో ద్వారం ఉంది. దేవుడిని కూడా తిరుమల నాథుడని, వేంకట్వేరుడని, సీతారాముడని, విష్ణువని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఆలయానికి దక్షిణం, పశ్చిమ దిశల్లో మంటపాలున్నా యి. ఉత్తర దిశన ఉన్న గుండ్లకు హనుమాన్‌, గరుత్మంతులవి రెండేసి విగ్రహాలు తొలిచి ఉన్నాయి . ఆలయ భాగంలోనే ఈశాన్యంలో అమ్మవారి గుడి ఉంది. గర్భగృహానికి ఉత్తరంగా ఉన్న రంగ మంటపం నల్లరాతి స్తంభాలతో శిల్పకళాశోభితమై చూపరులను కట్టిపడేస్తుంది.

ఆలయం చుట్టూ ప్రదక్షిణపథం ఉంది. ఆలయం వెనుకవైపున్న సహజ శిలలు, గుహలు మన దృష్టిని విశేషంగా ఆకర్షిస్తాయి. ఆలయానికి వాయువ్యదిశలో ఆళ్వార్ల మందిరం ఉంది. నైరుతి దిశలో కొంత దూరా న మరో మందిరం ఉంది. దాన్ని హనుమాన్‌ మందిరం అంటున్నారు. కాని అందులోని రాయికి చెక్కిన విగ్రహం మాత్రం హనుమంతుని చిత్రంలా లేదు. ఈ మందిరానికి తూర్పున ఉన్న ఇంకో చిన్న మంది రాన్ని ఇటీవలే దుండగులు ధనం కోసం ధ్వంసం చేశారు.
ప్రధానాలయానికి ఎడమపక్కన ఒకప్పుడు ఒక పెద్ద మఠం లేదా సత్రం ఉండేదనడానికి నిదర్శనంగా దాని పునాదులు కనిపిస్తున్నాయి. దాని ముందు వంటశాల, పూజారి గదుల పునాదులు కనిపి స్తున్నాయి. ఇప్పు డు ఈ పరిసరాల్లో మేకలు మేస్తున్నాయి. అదొక అందమైనప్పటికీఓడ లు బళ్ళు - బళ్ళు ఓడలు అవుతాయిఅనే సామెత గుర్తురాక తప్పట్లేదు.

శాసనాలు - చరిత్ర
ఆలయం ముందు ధ్వజస్తంభం నిలబెట్టిన గుండు కింద రెండు గజాల పొడవుతో ఏడు వరుసల శాసనం ఒకటి ఉన్నది. ఆలయపు కుబేరస్థాన మైన ఉత్తరదిశలో ఉన్న గుండుకు చెక్కిన హనుమ ,గరుత్మంత శిల్పాల కింద రెండున్నర గజాల పొడవుతో నాలుగు వరుసల శాసనం మరొకటుంది. ఇవి రెండూ ఒకదాని తరువాత మరొకటి కాకతీయుల తరువాతి కాలంలో... అనగా 14 నుంచి 16 శతాబ్దాల మధ్యకాలంలో చెక్కినట్టుగా లిపి పద్ధతిని బట్టి అర్థమవుతున్నది. మొదటి శాసనానికి భక్తులు సున్నం, బూజు పూశారు. కాబట్టి దాన్ని శుభ్రంగా కడిగి కాపీ (నకలు) ఆలయపు అసలు చరిత్ర బయటికొస్తుంది. ఏమైనా ఈ శాసనాలు ఇక్కడి ఆళ్వార్ల సన్నిధి, హనుమ, గరుత్మంత విగ్రహాలు ఒకే కాలానికి చెందినవని చెప్పవచ్చు.

అయితే ఆలయ చరిత్ర మాత్రం మరో వేయి సంవత్సరాలు ముందుకెళ్తుందనడానికి ఇక్కడ నిదర్శ నాలున్నాయి. మొదట ఈ క్షేత్రం ఒక స్ర్తీ దేవతలదని తెలుస్తోంది. విగ్రహారాధన ప్రారంభమైనప్పటి నుంచీ స్ర్తీ దేవతారధన ఉంది. చారిత్రక యుగం తొలినాళ్ళలో స్ర్తీ దేవతను హారతిఅనేవారు. తొలి చాళుక్యులు ఆమెకు మొట్టమొదటి గుహాల యాలు కట్టించారు (క్రీశ 7వ శతాబ్దంలో). వారి కాలపు నిరాడంబర స్తంభాల మంటపం, స్తంభాల కింద పూర్ణకుంభ శిల్పాలు, పై ద్వారబం దానికి గజలక్ష్మి శిల్పం మొదలైన వాస్తు శిల్ప విశేషాలను ఇక్కడి ఆల యంలో చూడవచ్చు.

తరువాత వచ్చిన మలి చాళుక్యులు 10-11 శతా బ్దాల్లో ఈ ఆలయపు దక్షిణ మంటపాన్ని నిర్మించి మరికొన్ని నిర్మాణాలు చేయించి ఉంటారు. ముందున్న శిథిల సీతారామాలయంలోని సీత విగ్రహం పద్మాసనంలో యోగస్థితిలో ఉన్నది. మరోచోట చింతచెట్టు కింద ఆసీనురాలైన స్ర్తీ దేవతా విగ్రహం ఉన్నది. ఇవి కూడా మలి చాళుక్యుల కాలం నాటివే అయ్యుంటాయి. కాకతీయులు (12, 13 శతాబ్దాలు) అందమైన రంగమంటపాన్ని కట్టిం చారు. వీరి కాలానికి అటు ఇటుగా ఇక్కడ భైరవోపాసన కూడా జరిగిం దనడానికి నిదర్శనంగా కొండ మెట్లకు కుడివైపున భైరవ శిల్పం కనిపి స్తుంది. ఇక చివరిగా 15, 16 శతాబ్దాల్లో ఈ ఆలయం ఇప్పుడు కనిపిస్తు న్న వైష్ణవాలయ రూపాన్ని సంతరించుకున్నది. ప్రస్తుతం ఇక్కడ సంక్రాం తి పండుగకు జాతర జరుగుతుంది.
ఇలా చారిత్రక విశేషాలకు, సహజ సౌందర్యానికి నిలమైన ఈ తిరు మలనాథ కొండ హైదరాబాద్‌ నగరానికి చేరువలో ఉండి వారాంతపు పర్యటనలకు అనుకూలంగా ఉండడం విశేషం.
- డా ద్యావనపల్లి సత్యనారాయణ
సెల్‌: 9440687250

Tuesday 19 June 2012

రక్షణ లేని రామప్ప! published in Andhrabhoomi on 17.6.2012

  • --ద్యావనపల్లి సత్యనారాయణ

తెలుగుదేశాన్ని పరిపాలించిన అతి గొప్ప రాజవంశం ఓరుగల్లు కాకతీయులదైతే వారు కట్టించిన అతి గొప్ప దేవాలయం నేటికీ నిలిచి ఉన్నది రామప్ప. తెలంగాణలో ఉన్న రెండున్నర వేల ప్రాచీన దేవాలయాల్లో తలమానికమైనది. వాస్తు శిల్పాలకు మాత్రమే కాకుండా పేరిణి, కోలాటం వంటి శాస్ర్తియ, జానపద నృత్యాలకు కూడా చిరునామా రామప్ప. పాడి పంటలకు నిలయమైన రామప్ప చెరువు ఈ దేవాలయ ప్రాశస్త్యాన్ని మరింత నొక్కి వక్కాణిస్తుంది.
రామప్ప నేపథ్యం రామప్ప కట్టడాలు వరంగల్లుకు సుమారు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ములుగు మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్నాయి. రామప్ప అనేది ఈ దేవాలయాలను కట్టించిన శిల్పి పేరని కొందరు భావిస్తే కాదు ప్రధానాలయంలోని దేవుని పేరు రామలింగేశ్వరుడు కాబట్టి ఈ దేవాలయానికి రామప్ప అనే పేరు వచ్చిందని మరి కొందరు అంటారు. రాముడు వైష్ణవ మత సంబంధితుడు కాగా, లింగం లేదా శివుడు శైవ మత సంబంధితుడు. ఈ రెండు మతాలను కలిపి రామలింగేశ్వర ఆలయాలను కట్టించడం అనేది విష్ణుకుండినుల కాలం (క్రీ.శ.5వ శతాబ్దం) నుండి వస్తున్న ఆచారం. కాకతీయులు విష్ణుకుండి మాధవవర్మను తమ మూల పురుషుడిగా చెప్పుకున్నారు. కాబట్టి, ఇప్పటికీ రామప్ప ఆలయ అంతరాళంలో విష్ణుకుండినుల సంప్రదాయ శిల్పం సప్తమాతృకల (హారీతి) శిల్పం కన్పిస్తుంది కాబట్టి ఈ దేవాలయ మూలాలు విష్ణుకుండినుల కాలం నుండే ఉన్నాయంటే కూడా నమ్మవచ్చు.
పాలంపేట, ములుగు ప్రాంతాల్లో కొన్నిచోట్ల కొత్త రాతియుగం, రాకాసి గుళ్లు యుగం నాటి మానవుల స్థావరాలు, ఆయుధాలు, పనిముట్లు కూడా లభించాయి కాబట్టి ఇక్కడ వేల సంవత్సరాల క్రితం నుంచే మానవ జీవనం పరిఢవిల్లిందని చెప్పాలి. ఈ వేల సంవత్సరాల చరిత్రకూ రామలక్ష్మణుల చరిత్రతో కూడా సంబంధం ఉంది. క్రీ.పూ.5077 సం.లో వారు ఇక్కడి అడవుల్లో సంచరించారని, ఆ క్రమంలో వారు నీటికొరకై భూగర్భంలోకి శక్తివంతమైన బాణాలు వేసి రెండు వాగులను సృష్టించారని, వారి పేరు మీద వాటి పేర్లు రామప్ప, లక్నవరం చెరువులుగా స్థిరపడ్డాయని శాస్ర్తియ, జానపద పరిశోధనల సారాంశంగా తెలుస్తుంది. ఈ రెండు చెరువులు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఇక ములుగు ప్రాంతంలో దొరికిన ప్రాచీన మానవుల పనిముట్ల ప్రాచీనత ఆధారంగాములుగుపద ప్రాచీనత ఆధారంగా కొందరు చరిత్రకారులు అశ్మక రాజ్యంతో కలిపి పేర్కొనబడిన ములక రాజ్యంఈ ప్రాంతమేనని వాదించారు. ఈ రెండు రాజ్యాలు సుమారు రెండున్నర వేల సంవత్సరాల కిందటి నుండి మనుగడలో ఉన్నాయి. శాతవాహన సామ్రాజ్యంలో ప్రాంతీయ రాష్ట్రాలుగా కొనసాగాయి. శాతవాహన సామ్రాజ్యం కూడా రెండువేల ఏళ్ల నాటిది. ఈ విధంగా ములుగు - రామప్ప ప్రాంతాలకు వేల సంవత్సరాల వైభవ చరిత్ర కూడా ఉంది.
1213 మార్చి 31నాటి కట్టడాలు
 రామప్పలోని ప్రధాన దేవాలయ ఆవరణలో ఉన్న ఒక దీర్ఘ శాసనంలో రామప్ప ఆలయ దేవతలైన శ్రీ రుద్రేశ్వర స్వామికి, కాటేశ్వర, కామేశ్వర సాములకు శాలివాహన శకం 1135 సం. శ్రీముఖ నామ సంవత్సరం, చైత్రమాసం, శుక్లపక్షం, అష్టమి తిథి, పుష్యమి నక్షత్రం ఆదివారంనాడు ఈ ఆలయాల నిర్మాత రేచర్ల రుద్రయ్య తన రాజ్యంలోని కొన్ని గ్రామాలను శాశ్వత ధర్మముగా దానం ఇచ్చినట్లు తెలుగు - కన్నడ లిపిలో రాసి ఉంది. శాసనంలో పేర్కొన్న తేదీ క్రీ.శ.1213 మార్చి 31 అవుతుంది. అప్పటికే అన్ని ఆలయాల నిర్మాణం పూర్తయింది.
రేచర్ల వంశీయులు కాకతీయుల సామంతులలో ముఖ్యమైనవారు. ఈ రెడ్ల వంశంలో ఆరవ తరానికి చెందిన రుద్ర చమూపతి అతి గొప్ప వీరుడు. అంతే గొప్ప కళాపోషకుడు. ప్రజాసంక్షేమ పక్షపాతియైన ఆర్థికవేత్త. కాకతీయ రాజుల్లో అతి గొప్ప రాజైన గణపతిదేవుని అతని రాజు కాక మునుపు మహారాష్ట్ర యాదవ రాజు జైతుగి చెర నుండి విడిపించి, ఓరుగల్లు సింహాసనంపై నిలిపి కాకతీయ సామ్రాజ్య స్థాపనాచార్యఅనే బిరుదు పొందాడు. ఈయన వరంగల్లు జిల్లా తూర్పుననున్న ప్రాంతాలను పరిపాలించాడు. ఈయన రామప్పలో తన పేరు మీద ప్రధాన దేవాలయం రుద్రేశ్వరాలయాన్ని కట్టించాడు. ఇందుకు నిదర్శనంగా ఈ ఆలయ అంతరాళపు ద్వారం ఉత్తర భాగంలోరేచర్ల రుద్రుని దంపతులవిగ్రహం చూడవచ్చు. ఇతడే తన తల్లిదండ్రులు కాటయ, కామాంబల పేరు మీద ప్రధానాలయానికి ఉత్తర దక్షిణ దిశలలో కాటేశ్వర, కామేశ్వర ఆలయాలను కట్టించాడు. కామేశ్వర ఆలయాన్ని కొంతమంది కల్యాణ మండపమని పొరపడుతున్నారు. కామేశ్వర ఆలయం పక్కనున్న నరసింహాలయాన్ని పాకశాల అంటున్నారు.
ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న నంది మండపంలోని నంది కాకతీయ శైలికే తలమానికంగా పేరొందింది. ప్రధానాలయం నుంచి దక్షిణంగా రామప్ప చెరువు వైపు వెళ్తున్నప్పుడు రోడ్డుకు ఎడమపక్కన పంట పొలాల్లో రెండు మూడు దేవాలయాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. చెరువు గట్టు పైకి ఎక్కగానే మరో రెండు మూడు దేవాలయాలు కన్పిస్తాయి. గట్టుపైన ఒక ఫర్లాంగు దూరం తూర్పు వైపు నడిచి చెరువు కొనను చేరుకోగానే మరిన్ని దేవాలయాలు జీర్ణావస్థలో కన్పిస్తాయి. ఇలా ఇంకెన్ని దేవాలయాలు కాలగర్భంలో కలిసిపోయాయో తెలియదు. ఈ దేవాలయాల పేర్లేంటి? వీటిని ఎవరు, ఎప్పుడు, ఎందుకు కట్టించారు? అనే విషయాలు చరిత్రకు అందవు.
శిథిలమవుతున్న ఈ చెరువుగట్టు ఆలయాల వాస్తు శిల్ప వైభవాన్ని నెమరువేసుకుంటే హృదయం చెరువవుతుంది. వాస్తు శిల్పాల వైభవం కాకతీయుల ఆలయాల్లో త్రికూటాలయాలు పేరెన్నిక గన్నవి. అయితే రామప్ప దేవాలయం మాత్రం త్రికూటాలయం కాదు. కాని మూడు ప్రవేశ ద్వారాలున్న ఆలయం. ఆలయం తూర్పునకు అభిముఖంగా ఉండగా ఉత్తర, దక్షిణ దిశల్లో కూడా ప్రవేశద్వారాలున్నాయి. ఇదొక ప్రత్యేకత. ప్రధాన ఆలయంలోకి నంది మండపం నుండి కాటేశ్వర ఆలయం నుండి, కామేశ్వర ఆలయం నుండి ప్రవేశించవచ్చు. ప్రధానాలయంలోకి ప్రవేశించి విశాలమైన రంగ మండపంలోకి చేరుకుంటాం. రంగ మంటపంలో జరిగే నాట్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు వీలుగా కూర్చునేందుకు మంటపం మూడు పక్కలా అరుగు గద్దెలున్నాయి. ఇది కూడా కాకతీయ వాస్తు ప్రత్యేకత. రామప్ప ఆలయం ఆరున్నర అడుగుల ఎతె్తైన పీఠంపై నిర్మించబడింది. ఆలయం చుట్టూ పది అడుగుల వెడల్పైన ప్రదక్షిణ పథం ఉంది. ఈ ప్రదక్షిణ పథంలో ఆలయం చుట్టూ తిరుగుతూనే రామప్ప ఆలయ శిల్పకళా చాతుర్యాన్ని వీక్షించవచ్చు.
రామప్ప ఆలయంలో మూడు ముఖ్యమైన శిల్పరీతులు కన్పిస్తాయి. ఒకటి - దేవతా మూర్తుల శిల్పాలు, రెండు - ఊత శిల్పాలు, మూడు - జానపద శిల్పాలు. మొదటి రెండు తరగతులకు చెందిన శిల్పాలు నల్లరాతితో చేసినవి కాగా మూడవ తరగతికి చెందిన శిల్పాలు స్థానికంగా లభించే ఎర్ర రాతితో చేసినవి. దేవతా మూర్తుల శిల్పాలు దేవాలయ అంతర్భాగాల్లో ఉండగా, ఊత శిల్పాలు దేవాలయం చుట్టూ గోడలు, స్తంభాల పైనున్న చూరుని ఎత్తిపట్టుకున్నట్లుగా ఉన్నాయి. ఇలాంటివి ఆలయ మూడు ప్రవేశ ద్వారాలకు రెండు వైపులా రెండేసి ద్వారానికి నాలుగు చొప్పున మొత్తం పనె్నండు నిలువెత్తు శిల్పాలున్నాయి. నృత్య భంగిమల్లో ఉన్న ఈ స్ర్తి శిల్పాలను మదనికలు, సాలభంజికలు, నర్తకీమణులు తదితర పేర్లతో పిలుస్తున్నారు. కాకతీయ శిల్పరీతికే ఇవి తలమానికాలు. ఈ మదనికల వలెనే ఆలయం చుట్టూ 28 గజ-కేసరి (ఏనుగుపై సింహాలు) శిల్పాలున్నాయి. ఇక ఆలయం చుట్టూ గోడలపై వరుసలు వరుసలుగా ఏనుగులు, వివిధ మత శాఖలు, శృంగారం తదితర అంశాలను వ్యక్తపరిచే జానపద శిల్పాలున్నాయి. ఆలయం లోపలి స్తంభాలకు కూడా ఇలాంటి శిల్పాలు చెక్కారు. ఇంకా నిలువెత్తు ఏకశిలా ఏనుగు విగ్రహాలు కొన్ని ప్రవేశ ద్వారాల్లో కన్పిస్తాయి. లేచి పరుగెత్తడానికి సిద్ధంగా ఉందనేట్లు చెక్కిన ఏకశిలా నంది విగ్రహం కాకతీయ శైలికి ప్రతీకగా వెలుగొందింది. అలాగే గర్భ గృహంలోని నాలుగు అడుగుల ఎతైన శివలింగం కూడా కాకతీయ శైలీ ప్రత్యేకతను చాటి చెప్తుంది.
రంగ మంటపం నైరుతి స్తంభానికి చెక్కిన రతీ మన్మధులు, పాల సముద్ర మథనం, వాయవ్య స్తంభానికి చెక్కిన గోపికలు కృష్ణుల మధుర భక్తి శిల్పాలు నాలుగు అంగుళాల ఎత్తులోనే ఎంత అందాన్నీ నైపుణ్యతను వ్యక్తపరుస్తాయో చూస్తేనే అర్థమవుతుంది. నైరుతి, ఈశాన్య స్తంభాల శిల్పాల మధ్య సూది మాత్రమే దూరేటంత సన్నని రంధ్రాలను తొలవడం శిల్పి నైపుణ్యానికి గీటురాయి. అలాగే అంతరాళ ద్వారపు దక్షిణ పక్కనే తాకితే సప్తస్వరాలు పలికే రాతి చెట్టును శిల్పించడం శిల్పి అనన్య సామాన్య ప్రతిభకు తార్కాణం. అయితే ఈ శిల్పం మీదనే ఒక సన్యాసి అంగాన్ని చూషణ చేస్తున్న వ్యక్తి శిల్పాన్ని శిల్పి చెక్కడంలో ఆంతర్యమేమిటో ఇప్పటికీ అంతుబట్టదు.
పేరిణి నృత్య శిల్పాలు
 ఇటీవలి కాలం వరకు ఆంధ్రప్రదేశ్ నాట్యంగా పేరొందింది కూచిపూడి నాట్యం. అయితే దాని చరిత్రను ఎంత శోధించినా, 15, 16 శతాబ్దాల కంటే వెనుకకు పోవడం లేదు అని ప్రముఖ పరిశోధకుడు ఆరుద్ర తేల్చిచెప్పారు. మరి క్రీ.శ. 1213 కంటే ముందే మనుగడలో ఉన్న పేరిణి నృత్యం మనకు కనీసం తెలియను కూడా తెలియకపోవడం విచారకరం. పేరిణి నృత్యం ఒక జానపద లేదా దేశి నృత్యమని చెప్తూ దాన్ని ఒక ప్రత్యేక ప్రకరణంలో వివరించాడు జాయప సేనాని - తన నృత్తరత్నావళిలో. ఈయన గణపతిదేవ చక్రవర్తికి బావమరిది మాత్రమే కాకుండా ఆయన గజ సాహిణి (గజ సైన్యాధిపతి) కూడా. క్రీ.శ.1200ల ప్రాంతంలో రాజకీయ, మత రంగాల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కాకతీయ రాజ్యాన్ని మహారాష్ట్ర యాదవ రాజులు ఓడించి రాకుమారుడు గణపతిదేవుని బందీ చేశారు. కర్ణాటకలో ప్రజ్వరిల్లిన వీరశైవ మతం ఇతర మతాల హింసను కూడా ప్రోత్సహించింది. వీరశైవ మత ప్రభావం వల్లనే కాకతీయులు జైనం నుండి శైవానికి మారి తెలుగు దేశమంతటా శైవాలయాలు కట్టించారు. ఈ రాజకీయ, మత మార్పులు దేశభక్తిని, దైవభక్తిని వీరరసంతో మేళవించి పెంపొందించాయి. ఫలితంగా పౌరుల్లో.. ముఖ్యంగా యువకులను ఉత్తేజితులను చేయటానికి ప్రేరణఅనే ఒక కొత్త నృత్యరీతి పురుడు పోసుకుంది. ఇది అప్పటికే ఆచరణలో ఉన్న కొన్ని ఆటవిక, జానపద నృత్యరీతులను వీరరస ప్రధానంగా తీర్చిదిద్దగా ఏర్పడింది.
శివుడు నటరాజుగా ప్రతిపాదించిన నాట్యరీతిగా ప్రచారంలోకి వచ్చింది.ప్రేరణఅనే పదం రూపాంతరం చెంది పేరిణి అయ్యింది. పేరిణి శిల్పాలు రంగ మంటపం ఆగ్నేయ స్తంభానికి, ఉత్తర దూలానికి, పై కప్పుకు, అంతరాళ ద్వారానికి ఇరువైపులా చెక్కబడి ఉన్నాయి. స్తంభాలు - చూరుల మధ్య చెక్కిన మదనికల ఊత శిల్పాలలో కూడా కొన్ని పేరిణి తాండవ శిల్పాలే. రంగ మంటపం ఆగ్నేయ స్తంభానికి చెక్కిన ఒక పేరిణి నృత్య శిల్పంలో శివప్రియనాట్య భంగిమ కన్పిస్తుంది. ఈ శిల్పంలో ముగ్గురు స్ర్తిలు నాలుగు కాళ్లతో నాట్యం చేస్తున్నట్లుగా శిల్పించబడ్డారు. మధ్యలో ఉన్న స్ర్తి కుడికాలు తనకు కుడివైపునున్న స్ర్తికి ఎడమకాలు కాగా, ఎడమ వైపున్న స్ర్తికి తన ఎడమ కాలు కుడికాలు అయినట్లుగా శిల్పించబడింది. లేదా ఒకే స్ర్తి వీరరసంతో వేగంగా నాట్యం చేస్తుండగా ప్రేక్షకులకు మూడు రూపాలుగా కన్పిస్తుందన్న భావాన్ని వ్యక్తపరిచాడేమో శిల్పి. రంగ మంటపం ఉత్తర దూలానికి గజాసురుని భక్తికి వశుడై అతని పొట్టలో బంధించబడిన శివుడు ఎనిమిది చేతులతో నాట్యం చేస్తున్న నటరాజుగా శిల్పించబడ్డాడు. ఈ శిల్పంలో కన్పించే కటి వస్త్రం, భుజ కిరీటాలను పేరిణి నృత్య ఆహార్యంలో వాడుతారు. అంతరాళ ద్వారానికి రెండు వైపులా రెండు పొడవైన ఘనాకార శిల్ప పలకలున్నాయి. వీటికి మృదంగాన్ని వాయిస్తున్న వాయిద్యానికి అనుగుణంగా నాట్యం చేస్తున్న స్ర్తి పురుషుల శిల్పాలు అనేకం చెక్కబడ్డాయి. ఇవి పేరిణి శివతాండవానికి చెందిన వివిధ భంగిమలను ప్రతిబింబిస్తున్నాయి. రంగ మంటపం కప్పునకు కూడా పది చేతులతో నర్తిస్తున్న నటరాజ శిల్పం అత్యద్భుతంగా చెక్కబడింది. రంగ మంటపానికి మరో పేరు నాట్య మంటపం. ఈ మంటపం మధ్యలో గుండ్రని ఏకశిలా వేదిక ఉంది. ఈ వేదికపైన దేశంలో పేరొందిన నాట్యకత్తెలు, గణికలు నృత్యం చేసేవారు. వారికి ఆనాడు సమాజంలో చాలా గౌరవం ఉండేది. కాకతీయ సామ్రాజ్య చివరి చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుని భార్యల్లో ఒకామె - మాచల్దేవి. మాచల్దేవి తెలుగు దేశమంతటా ప్రఖ్యాతి గాంచిన నాట్య కళాకారిణి. సకల కళావల్లభురాలు. ఈమె ఇక్కడి రంగ మంటపంలో నాట్యంచేసి ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు.
మదనిక శిల్పాలు పనె్నండు పేరిణీ నృత్య భంగిమలను తెలిపేవే అని వాదించేవారు కూడా కొందరున్నారు. వాటిల్లో ఒక స్ర్తి శిల్పం ఆటవిక నృత్య రీతిని తెల్పేదిగా వుంటే, మరొకటి శాస్ర్తియ నృత్య భంగిమలో ఉంది. ఒక శిల్పం గణిక ఆహార్యంతో రాజసభలో నాట్యం చేస్తున్నట్లుగా చెక్కబడగా, మరొకటి నాగిని నాట్యం చేస్తున్నట్లుగా చెక్కబడింది. ఇటీవలి కాలం వరకు కూడా తెలంగాణలో పెళ్లి మేళాలతో బాజా భజంత్రీలు - సన్నాయిల మోతలకు అనుగుణంగా ప్రత్యేకంగా భూమిపై పాములా పొర్లుతూ నాట్యం చేసే సంప్రదాయం కొనసాగడాన్ని బట్టి నాట్య నాగిని శిల్ప ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ శిల్పాలన్నింటికీ మినీ స్కర్ట్ వంటి కటి వస్త్రం ఉండడాన్ని గమనించవచ్చు. ఒక్క నాగిని శిల్పానికి తప్ప. ఇలాంటి వస్త్రానే్న పేరిణి నృత్య ఆహార్యంగా వాడుతారు. ఒక నర్తకి శిల్పానికి ఎతైన మడమ చెప్పులు (హై హీల్స్) ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఒక నర్తకి కటి వస్త్రాన్ని ఒక వానరం లాగుతూండగా ఆమె మర్మాంగం బయటపడుతున్నట్లు ఒక శిల్పం చెక్కబడింది. నాగిని నాట్యకారిణి పూర్తిగా నగ్నంగా ఉంది. ఈ శిల్ప అందానికి ముగ్ధుడైన ఒక నిజాం ప్రభుత్వ అధికారి సుమారు వందేళ్ల క్రితం ఈ శిల్పాన్ని తన ఇంట్లో పెట్టుకున్నాడట. పీడకలలు రావడంతో మళ్లీ ఇక్కడికి తెచ్చి పెట్టాడట. ఈ శిల్పం ఇప్పటికీ ఎంతోమంది కవులు, గాయకులు, కళాకారులను అలరిస్తూనే ఉంది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారె దృష్టినీ ఆకర్షించి ఆయన చేత నాగినివో భోగినివో, నాట్యకళా విలాసినివోఅనే సినిమా పాటను రాయించడం ఈ శిల్ప ఘన చారిత్రకాంశాలలో ఒకటి మాత్రమే. ఎక్కడో విదేశంలో ఉన్న నటరాజ రామకృష్ణ ఇక్కడికి వచ్చి పైన పేర్కొన్న నృత్య శిల్పాలతోపాటు మరెన్నో శిల్పాలను పరిశీలించి, పరిశోధించి, వాటినినృత్తరత్నావళిలోని పేరిణి నృత్య భంగిమలతో పోల్చి చూసి చివరిగా పేరిణి నృత్యాన్ని పునరుద్ధరించగలిగాడు. దానికి ప్రభుత్వ గుర్తింపు తేగలిగాడు. ఇదంతటికీ రామప్ప శిల్పాలు ఆధారభూతాలు కావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం.
జానపద శిల్పాలు
 జానపద శిల్పాలు అంటే సామాన్య ప్రజల జీవన విధానాన్ని తెలిపేవి మాత్రమే కాకుండా, అంతగా శిల్ప శాస్త్రం తెలియని సామాన్య శిల్పులే చెక్కిన శిల్పాలు అని అర్థం. ఇవి రామప్ప ఆలయం చుట్టూ గోడలపైన ఉన్నాయి. ఆలయం చుట్టూ ఒక వరుసలో ఏనుగులు శిల్పించబడగా, వాటిపైన వరుసలో వజ్రబంధాలు చెక్కారు. ఈ రెండు వరుసల మధ్య వరుసలో వివిధ మతాలకు చెందిన శిల్పాలు, వేట దృశ్యాలు, ఇతర జీవన విధానాలు చెక్కబడ్డాయి. ఆలయం పడమటి వైపున చెక్కిన నాలుగు శిల్పాల్లో మొదటి దానిలో స్ర్తి పురుషుడు ప్రేమించుకోవడం, రెండవ దానిలో పురుషుడు శృంగారానికి ఉద్యుక్తుడవడం, మూడవ దానిలో స్ర్తి ఉద్యోక్తురాలవడం, నాల్గవ దానిలో ఇద్దరూ సంగమించడం శిల్పించబడ్డాయి. జానపద నృత్యాల్లో తెలంగాణలో అత్యంత ప్రధానమైనదీ, ప్రాచీనమైనదీ కోలాటం. ఈ కోలాట దృశ్యాలు అత్యంత మనోహరంగా ఈ దేవాలయ గోడలపై చిత్రించబడ్డాయి. రంగ మంటపపు నైరుతి స్తంభంపై కూడా ఈ కోలాట దృశ్యాలు చెక్కి ఉన్నాయి. మార్చి నెలలో వచ్చే కాముని పౌర్ణమికి ముందు వెనె్నల రాత్రిళ్లలో తెలంగాణలో జాజిరి పాటలతో కోలాటం ఆడి పౌర్ణమినాడు కామ దహనం చేయడం ఆచారంగా వస్తున్న విషయం ఇక్కడ గమనార్హం. పాడి పంటల ప్రాధాన్యత
కాకతీయ రాజులు స్థానికులు కాబట్టి స్థానిక ప్రజల సంక్షేమం కోసం ఎన్నో నిర్మాణాలు చేపట్టారు. వాటిల్లో తలమానికమైనవి వారు తవ్వించిన చెరువులు. వారి కాలంలో తవ్వించిన వేల కొలదీ చెరువులను రక్షించుకుంటే చాలు, మన వ్యవసాయ రంగానికి మరో ప్రాజెక్టు కొత్తగా కట్టవలసిన అవసరమే లేదనేది నిపుణుల అంచనా. ప్రజలకు ముందు తిండి కావాలి. ఆ తరువాతే మతం. కాబట్టి రేచర్ల రుద్రుడు రామప్ప గుడి మీదుగా ఒక కిలోమీటరు దూరంలో కొండల మధ్య ఆనకట్ట కట్టించి పెద్ద తటాకాన్ని ఏర్పరిచాడు. దీనికి కూడా రామప్ప చెరువు అనే పేరు వచ్చింది. ఇది ఈ రోజు వరకు కూడా పదివేల ఎకరాల భూమికి సాగునీటిని అందిస్తోంది.
రామప్ప చెరువు గట్టు ఈశాన్య మూలలో పాడి పంటల ప్రాధాన్యాన్ని తెలిపే దేవాలయాన్ని కట్టించారు. అందులో ఇటీవలి కాలం వరకు స్థానికుల చేత వేశ్య గా పిలువబడిన ఒక నగ్న సుందరి శిల్పం ఉండేది. నిజానికది వేశ్యది కాదు అనేది మేధావుల అభిప్రాయం. ఆ శిల్పానికున్న స్తన సంపద, నగ్నత్వం, పాడి పంటలు, సంతాన సృష్టి, అభివృద్ధిలను తెలిపే సంకేతాలు. దురదృష్టవశాత్తు దుండగులు ఈ అందమైన విగ్రహాన్ని నిధి దొరుకుతుందనే ఆశతో ధ్వంసం చేశారు. ఈ చెరువు గట్టు ఆలయంలోని ఒక స్తంభం కింది భాగంలో ఒక శిల్పం ఉంది. అందులో ముగ్గురు స్ర్తిలను నగ్నంగా చెక్కారు. ఒక స్ర్తి కుండలో నుండి పాలను వొంపుతుంటే, మరొక స్ర్తి పంట కంకిని పట్టుకున్నట్లు చెక్కారు. మధ్యలో ఉన్న స్ర్తి పంటను మోసుకొస్తున్నట్లుగా చెక్కబడింది. ఈ విధంగా రామప్ప ప్రాంతం వాస్తు శిల్పకళా కౌశలాలకే కాదు, కాసులు పండించే పంటల వృద్ధికీ నిదర్శనంగా నిలుస్తుంది.
శిథిలం కావడానికి కారణాలు
సుమారు వంద సంవత్సరాల కాలం రాజ పోషణకు, ప్రజాదరణకు నోచుకున్న రామప్ప ఆలయాలు పధ్నాల్గవ శతాబ్ద ప్రారంభంలో కాకతీయ రాజ్యంపై దండయాత్రలు చేసిన ఢిల్లీ సుల్తానుల విధ్వంసకాండకు గురైంది. నాలుగైదుసార్లు అలాంటి దండయాత్రలు జరిగాయి. నీటిపై తేలే ఇటుకలతో నిర్మించిన ఆలయ గోపురం ముస్లింల దాడిలో ధ్వంసమైంది. ఇక్కడి విగ్రహాలు విచ్ఛిన్నమయ్యాయి. అయితే రామప్ప ఆలయాలు శిథిలమవడానికి ఇతర కారణాలు కూడా లేకపోలేదు. ఆలయ నిర్మాణంలో ఇసుక పునాదులను ఉపయోగించడం కాకతీయ వాస్తు శైలి ప్రత్యేకత. అయితే ఇసుక పునాది మీద నిర్మించిన బరువైన ఆలయం వత్తిడికి ఇసుక ఇటు అటు జరిగి, కిందికి మీదికి జారిపోయి ఆలయం కుంగిపోవడానికి కారణమయ్యింది. గత ఎనిమిది వందల సంవత్సరాల కాలంలో చోటు చేసుకున్న చిన్నచిన్న భూకంపాల తాకిడికి కూడా గురైన ఇసుక పునాది ఆలయ కుంగుదలకు అవకాశమిచ్చింది. వర్షపు నీరు పునాదిలోకి ఇంకటం వల్ల కూడా ఆలయం కుంగింది. ఆలయం మీదుగా ఉన్న రామప్ప చెరువు నీటి బరువు కూడా ఆలయ పునాది మీద ప్రభావం చూపింది. ఫలితంగా ఆలయం కుంగి, స్తంభాలు, పైకప్పు, గోడలు పగుళ్లు చూపాయి. కొన్నిచోట్ల విరిగిపోయాయి కూడా.
ఇక ఈ మధ్య చోటు చేసుకుంటున్న మానవ తప్పిదాలు రామప్ప కట్టడాలకు మరింత ముప్పును తెచ్చిపెడుతున్నాయి. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా రామప్ప ఆలయాల పక్కనే పెద్దపెద్ద బాంబులు పేల్చడం, భూగర్భంలో సొరంగం తీయడం, గ్రానైట్ పేలుళ్లు మొదలైనవి రామప్పకు ఆగర్భ శత్రువులుగా పరిణమించాయి. ఈ మధ్య ఈ ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు నిక్షేపాలున్నాయని నిర్ధారణ అయ్యింది. బొగ్గు కోసం రామప్ప కింద చేసే సొరంగాలతో రామప్ప శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
పునరుద్ధరణ ప్రయత్నాలు
రామప్ప ఆలయాలను కట్టించిన రేచర్ల రుద్రుడే ఇక్కడ వేయించిన శాసనంలో ఎవరికైనా తాము శత్రువు కావచ్చు కాని ఈ ఆలయం కాదు కాబట్టి దీన్ని ధ్వంసం చేయకూడదు అని వేడుకున్నాడు. అయినా ముస్లిం సైన్యాలు చేసిన విధ్వంసకాండల్లో ఈ ఆలయం పాక్షికంగా దెబ్బతింది. అయితే మరో ఆరు వందల సంవత్సరాల తరువాత మళ్లీ ముస్లిం రాజే (నిజాం) సుమారు వంద సంవత్సరాల క్రితం రామప్ప ఆలయాలను పునరుద్ధరించేందుకు పూనుకున్నాడు. 1914లో ఏర్పడిన పురావస్తు శాఖ ఈ ఆలయాలను వీలైనంతగా పునరుద్ధరించింది. 1932లో పింగళి వెంకట రామారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ కాకతీయ ఉత్సవాలు జరిగాయి. తత్పర్యవసానంగా వెలువడిన కాకతీయ సంచికలో ఈ ఆలయాల ప్రాధాన్యం గురించి తెలుగు ప్రపంచానికి మొదటిసారిగా తెలిసింది. 1944లో ఆలయంలో పూజారులను నియమించారు. మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు ఈ ఆలయం దర్శనీయత గురించి ఇంగ్లీషులో రాసి ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో 1966లో ప్రచురించి ప్రపంచానికంతటికీ తెలియజేశాడు.
నటరాజ రామకృష్ణ రామప్ప శిల్పాలను అధ్యయనం చేసి పేరిణి నృత్యాన్ని పునరుద్ధరించి, 1985 ఫిబ్రవరి 17 శివరాత్రి నాడు ఇక్కడ వేల మంది సమక్షంలో తన శిష్య బృందంతో పేరిణి నృత్య ప్రదర్శన చేశాడు. తిరిగి 1991లో జరిగిన కాకతీయ ఫెస్టివల్‌లో భాగంగా ఫిబ్రవరి 25న తన శిష్యబృందంతో పేరిణి నృత్య ప్రదర్శన ఇప్పించాడు. భారత పురావస్తు శాఖ పూనా నుండి తేలికైన ఇటుకలను తెప్పించి ఆలయ శిఖరాన్ని పునర్నిర్మించి, పైకప్పును బాగుపరచి, ఆలయ పునాదుల్లోకి వాన నీరు ఇంకకుండా ప్లాస్టరింగ్ చేయించింది. 2013లో ఇక్కడ ఆలయం కట్టి ఎనిమిది వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉత్సవాలు జరుపనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామప్ప చెరువులో బోటింగ్ ఏర్పాటు చేసింది. పర్యాటకుల వసతి, తిండి కోసం వసతి గృహాలను, రెస్టారెంట్లను కట్టించింది. ఇవి ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయి.
మధ్య ఇక్కడ కొన్ని సినిమాలు తీయడంతో రామప్ప మరింత వెలుగులోకి వచ్చింది. రామప్పకు ఇటీవల ఏర్పడిన ప్రమాదాలపై పోరాడిన రామప్ప పరిరక్షణ కమిటీకృషి మేరకు ప్రభుత్వం నియమించిన కమిటీ రామప్పకు నిజంగానే ప్రమాదం పొంచి ఉందని, ప్రమాద నివారణకై కృషి చేయాలనితన రిపోర్టులో ప్రభుత్వానికి సూచించింది. రామప్ప పరిరక్షణ కమిటీ సాధించిన ఈ చిన్న విజయాన్ని పురస్కరించుకుని 1985లో నటరాజ రామకృష్ణ నిర్వహించినట్లుగానే ఈ నెల 17న రామప్పలో పదివేల దివ్వెల జాతరను నిర్వహించనుంది. రామప్ప పరిరక్షణకు తరలిరండి
రామప్ప కట్టడాలకు 800 ఏళ్లు నిండిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌లో నిర్వహించబోయే ఉత్సవాలకు ముందు రామప్ప పరిరక్షణ కమిటీ ఆందోళనలు నిజమేనని, రామప్ప కట్టడాలను పరిరక్షించాలనిచెప్పిన నగేశ్ (ఎన్‌జిఆర్‌ఐ) నివేదిక రావడం హర్షించాల్సిన విషయం. అయితే రామప్ప పరిరక్షణకు కృషి చేసిన ప్రజల పాత్రని గుర్తించకుండా, వారి భాగస్వామ్యం లేకుండా ఏకపక్షంగా జిల్లా యంత్రాంగం ఈ ఉత్సవాలను నిర్వహించడం సరికాదు. ఎన్‌జిఆర్‌ఐ సమర్పించిన 2500 పేజీల నివేదిక చారిత్రకమైనది. దాన్ని అమలుపరచవలసిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపైన ఉంది. రామప్ప పరిరక్షణోద్యమం ఇంతటితో ఆగేది కాదు. రేపు రామప్ప పరిసరాల్లో నేలలో నిక్షిప్తమైన బొగ్గు తవ్వి తీయడానికి ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పుడు ఇంకా పెద్ద ప్రమాదం ముంచుకు వస్తుంది. ఊళ్లకు ఊళ్ళు ఆనవాళ్లు లేకుండా పోయే పెనుముప్పు నుంచి కూడా రక్షించుకునే బృహత్ ప్రణాళికలను కూడా మనం రచించుకోవాలి. మానవ తప్పిదం కారణంగా భారీ ఎత్తున జరిగే ప్రమాదం నుండి రక్షింపబడిన రామప్ప విజయోత్సవ సభ జరపాలని ప్రజా సంఘాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా జూన్ 17 ఆదివారంనాడు రామప్ప ప్రాంగణంలో కట్టడం పరిరక్షణ - జాగ్రత్తలపై ఒక సదస్సు నిర్వహించి, జాతి సంపద ఐన రామప్ప కట్టడాలను, పరిసరాలను శుభ్రం చేసి, పదివేల దివ్వెల జాతరను నిర్వహించాలని రామప్ప కట్టడాల పరిరక్షణ కమిటీ తలపెట్టింది. ఈ ప్రజా విజయోత్సవ సభకు వేలాదిగా తరలివచ్చి రామప్ప పరిరక్షణోద్యమ స్వరంతో గొంతు కలుపవలసిందిగా కోరుతున్నాం. -ప్రొ.జయధీర్ తిరుమలరావు, అధ్యక్షుడు, రామప్ప పరిరక్షణ కమిటీ.
శిల్పుల నైపుణ్య సమగ్రత
         గణపతిదేవుని కాలంనాటి కొండపర్తి శాసనం కాకతీయ శిల్ప నిర్మాణ సామర్థ్యాన్ని కింది శ్లోకంలో వర్ణించింది. ప్రాకారోజయతి త్రికూటమ్ అభితస్తల్ తేన నిర్మాపితః సుశ్లిష్టైః క్రమశీర్షకై రుపచితో నీలోపలైః కల్పితః యశ్చా లక్షిత సంధిబంధ కథనాదేకశిలా తక్షకైః సంతక్ష్యేవ మహీయసీమ్ ఇవ శిలాం యత్నాత్ సముత్తారితః (నల్లని రాళ్లను సమానంగా నున్నగా చెక్కి, సన్నిహితంగా కూర్చి నిర్మించిన త్రికూట ప్రాకారం విలసిల్లుతూ ఉంది. అతుకుల గీతలు కనిపించకుండా ఏకశిలా నిర్మితంగా భాసించే ఈ ప్రాకారాన్ని మహా ప్రయత్నంతో శిల్పులు నిర్మించారు) కాకతీయ దేవాలయాల శిల్పుల నైపుణ్యం ఇటువంటి సమగ్రతను సంతరించుకుంది. ఇందుకు అతి గొప్ప నిదర్శనం పాలంపేటలోని రామప్ప దేవాలయం. -డా.పి.వి.పరబ్రహ్మ శాస్ర్తీ, ‘కాకతీయులురచయిత
స్వతంత్ర రీతికి చెందిన శిల్పాలు
నిజానికి కాకతీయ శిల్పంలో ఏది నృత్య శిల్పం? ఏది కాదు? అని తేల్చి చెప్పటం కష్టం. అలా తేల్చటానికి సాంకేతికంగా కొన్ని ఆధారాలున్నా కళాదృష్టితో చూస్తే, కాకతీయ శిల్పం అంతా అందమైన, లయాన్వితమైన నృత్య శిల్పమనే అనుకోవాలి. ఉదాహరణకు, ఎర్రరాతిలో ఏమంత ప్రాధాన్యత లేని స్థలాల్లో చెక్కిన అలంకార శిల్పంలోని సింహం నడుము మీద నిల్చుని ఒక చేత కత్తి, మరోచేత ఢాలు ధరించి వున్న స్ర్తిమూర్తి యుద్ధం చేస్తున్నట్లూ ఉంటుంది. అదే సమయంలో నృత్యం చేస్తున్నట్లూ ఉంటుంది. రూపకల్పనలో గాని, జీవ చైతన్య స్ఫురణలోగాని కాకతీయ శిల్పాలు స్వతంత్ర రీతికి చెందినవిగా స్పష్టంగా చెప్పుకోవచ్చును. దేశంలోని మరే శిల్పరీతినీ వీటితో పోల్చి చూడగల అవకాశం ఇవ్వని విధంగా ఇవి రూపొందాయి. -చలసాని ప్రసాదరావు, ‘కాకతీయ శిల్పంరచయిత
 తెలుగు శిల్పుల కళారాధన
రామప్ప గుడిలోని స్ర్తిమూర్తులు దాదాపు మానవ సహజ ఎత్తు కలిగి, పరిమిత అలంకరణములతో అలరారుచున్నవి. ఇవన్నియు నల్లని రాతితో మలచబడినవి. నల్లని కఠిన శిలలు ఆ అమర శిల్పుల చేతిలో నల్లని వెన్నగా, మైనముగా మారినవా! కర్రతో సైతము ఇంతటి పనితనమును ప్రదర్శించుట కష్టమే! అలాంటప్పుడు ఆ శిల్పుల నైపుణ్యం, అంకిత భావము, చిత్తశుద్ధి ఎంత గొప్పదో కదా! ఈ విగ్రహములలోని ఏ అంశమునకు ఆ అంశము ఎంతో స్పష్టంగా ఉన్నవి. ఉదాత్తతకు ఏ వంక పెట్టలేని విధముగా మలచబడినవి. వీని వొంపులు, సొంపులు, ఇంపులు, పట్టుపుట్టములు, నగలు, నఖశిఖ పర్యంతము ప్రతి అంశములో తెలుగు శిల్పుల కళారాధన పరాకాష్టత నందుకొనిన విధమును, తెలుగు యువతుల సౌందర్యమును పవిత్ర దృష్టితో దర్శించి ప్రశంసించవలసినదే కాని వర్ణించుట ఎవరి తరము కాదనుటలో అతిశయోక్తి ఎంత మాత్రము లేదు. ఆ శిల్పుల ఉలి విన్యాసము, హృదయము అంతటి గొప్పవి. వీని అమరికలో చూపబడిన నైపుణ్యమూ అద్భుతమే మరి! ఉపగ్రహము ద్వారా సేకరించబడిన ఛాయాచిత్రము గుడి ప్రాంతములో నేల పగులును సూచించుచున్నది. ఈ గుడి రక్షణను గూర్చి అందరూ ఆలోచించి రక్షించుకోవాలి. ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించి ఆదుకోవాలి. అందుకు వెంటనే ముమ్మర ప్రయత్నం చేయాలి.
-మందల మల్లారెడ్డి, ‘రామప్పగుడిరచయిత
ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజలు పట్టించుకుంటారు
ప్రజలు, పర్యాటకులు, కళాభిమానులు రామప్పను కేవలం ఒక దేవాలయంగా కాక ఒక సాంస్కృతిక కేంద్రంగా భావిస్తారు. అలాంటి సాంస్కృతిక చిహ్నానికి దేవాదుల ప్రాజెక్టు అండర్‌గ్రౌండ్ కాలువ పనుల వల్ల, భూగర్భ బొగ్గు గనుల తవ్వకాల వల్ల ముప్పు వాటిల్లుతున్నది. ఈ పనులు చేస్తున్న వారు ఈ కట్టడాల పరిరక్షకులైన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి అనుమతి తీసుకోకపోవడం, ఇంత జరుగుతున్నా ఆర్కియాలజీ వారు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం. రామప్ప కట్టడాల పట్ల ప్రభుత్వ శాఖల నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తున్నాయి. ఈ నిర్లక్ష్య వైఖరిని నిరసించి ప్రజలే తమ వారసత్వ చిహ్నాన్ని రక్షించుకునేందుకు సిద్ధం కావాలి. -వేదకుమార్, తెలంగాణ రిసోర్స్ సెంటర్
అత్యున్నత సంస్కృతికి ప్రతీక
మధ్యయుగాలలో యావత్ తెలుగుదేశాన్ని ఒక్క త్రాటిపైకి తెచ్చి ప్రజల సుఖ సంతోషాలే లక్ష్యంగా ఆదర్శన పాలన నెరిపింది కాకతీయ చక్రవర్తులు. వారు కట్టించిన అత్యద్భుత నిర్మాణాలు వరంగల్ కోటలోని స్వయంభూ దేవాలయం వంటి వాటిని దురదృష్టవశాత్తు మనం చూడటానికి నోచుకోలేక పోయాం. ఇక వారి సామంతుడు రేచర్ల రుద్రయ్య పాలంపేటలో కట్టించిన రామప్ప దేవాలయమే వారి అత్యున్నత సంస్కృతికి ప్రతీకగా నిలిచి ఉంది. దీనిని మనం దర్శించి, పరిరక్షించి మన భావి తరాలకు ఈ వాస్తు శిల్ప వారసత్వాన్ని అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రభుత్వమూ ప్రజల ప్రతినిధే కాబట్టి ఈ అద్భుత నిర్మాణ పునర్వైభవం కోసం కృషి చేయాలి. -ప్రొ.అడపా సత్యనారాయణ, చరిత్ర శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం
కళల కాణాచికి కరువాయె ఆదరణ
సాహిత్యం, నృత్యం, వాస్తు శిల్పాలు, ఆర్థిక వ్యవస్థలు మొదలైన కళలు వర్థిల్లిన రామప్ప కట్టడాలకే ప్రభుత్వ పనితీరు ఎసరు పెడితే ఇక పట్టించుకునే నాథుడెవరు అని మిన్నకుండిపోయే పరిస్థితి పోయింది. ప్రజలు చైతన్యవంతులయ్యారు. తమ జాతి వారసత్వ సంపదను సంరక్షించుకోవలసిన బాధ్యతను వారు గుర్తెరిగారు. అందుకొక నిదర్శనమే ఈ నెల 17న రామప్పలో జరుగుతున్న పదివేల దివ్వెల జాతర. -జూలూరి గౌరీశంకర్ తెలంగాణ రచయితల వేదిక.